మారని జగన్ సర్కార్ తీరు: మళ్లీ ఎదురుదెబ్బే: టీడీపీ నేతకు హైకోర్టులో రిలీఫ్: ఆ జీవో చెల్లదు
గుంటూరు: సంగం డెయిరీ.. కొద్దిరోజులు రాష్ట్ర రాజకీయాల్లో తరచూ వినిపిస్తోన్న పేరు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూలిపాళ్ల నరేంద్ర కుమార్కు చెందిన పాలు, పాల ఆధారిత పదార్థాల తయారీ సంస్థ ఇది. దీన్ని తాత్కాలికంగా పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ ఆధీనంలోకి తీసుకుని రావడానికి జగన్ సర్కార్ చేసిన ప్రయత్నాలకు ఏపీ హైకోర్టులో బ్రేక్ పడింది. దీనికి సంబంధించిన జీవోను హైకోర్టు కొట్టివేసింది. ధూలిపాళ్ల నరేంద్రకు ఊరట లభించినట్టయింది. ప్రస్తుతం ఆయన కస్టడీలో ఉన్నారు. ఆయనకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది.
సంగం డెయిరీలో అక్రమాలు చోటు చేసుకున్నాయనే కారణంతో ధూలిపాళ్ల నరేంద్ర కుమార్ను అవినీతి నిరోధక విభాగం అధికారులు అరెస్ట్ చేసిన అతి కొద్దిరోజుల్లోనే దాన్ని పాడిపరిశ్రమాభివృద్ధి సంస్థ పరిధిలోకి తీసుకుని రావడానికి కిందటి నెల 27వ తేదీన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఏపీడీడీసీ తరఫున గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార యూనియన్ లిమిటెడ్.. ఈ డెయిరీ రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుందంటూ తెలిపింది. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేక అధికారిని కూడా నియమించింది. గుంటూరు జిల్లా తెనాలి డివిజన్ సబ్ కలెక్టర్ను ప్రత్యేకాధికారిగా నియమించింది.
మూడునెలల పాటు సంగం డెయిరీ.. గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార యూనియన్ లిమిటెడ్ పర్యవేక్షణలో కొనసాగుతుంది. ఆ తరువాత అప్పటి పరిస్థితుల ఆధారంగా.. దీన్ని పొడిగించడమా? లేక మళ్లీ పాత యాజమాన్యానికి బదలాయించడమా అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఈ మేరకు పశు సంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య అప్పట్లో ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరు జిల్లా వడ్లమూడిలో ఉన్న సంగం జాగర్లమూడి డెయిరీ ఇక మూడు నెలల పాటు ప్రత్యేకాధికారి పర్యవేక్షణలో కొనసాగుతుందని పేర్కొన్నారు.
దీనిపై సంస్థ డైరెక్టర్లు కోర్టుకెక్కారు. హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన ఏపీ హైకోర్టు కొద్దిసేపటి కిందటే కీలక ఆదేశాలను జారీ చేసింది. సంఘం డెయిరీని తెనాలి సబ్ కలెక్టర్కు స్వాధీన పరుస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 19ని తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. డెయిరీ రోజువారీ కార్యకలాపాల్లో ఐఏఎస్ అధికారి జోక్యం చేసుకోవడం సరికాదంటూ డైరెక్టర్ల బోర్డు తరఫు న్యాయవాది వినిపించిన వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. సంగం డెయిరీ కార్యకలాపాలను యధాతథంగా నిర్వహించుకోవచ్చని హై కోర్టు తీర్పు ఇచ్చింది.