రేషన్ ఇంటికి పంపి.. స్కూళ్లకు అంతదూరం వెళ్లమంటారా ? జగన్ సర్కార్ కు హైకోర్టు ప్రశ్నలు
ఏపీలో పేదలకు ప్రజాపంపిణీ ద్వారా ఇస్తున్న రేషన్ ను ఇళ్ల వద్దకే పంపేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాలపై హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. వాహనాల ద్వారా ఇళ్లకు రేషన్ పంపడం ద్వారా ఎంతో విలువైన ప్రజాధనం వృథా అవుతుందని పిటిషనర్ ఆరోపించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. స్కూళ్లను దూరానికి మార్చి వెళ్లాల్సిందేనంటున్న ప్రభుత్వం రేషన్ ను ఇంటికి పంపడం సరేనదేనా అని ప్రశ్నించింది.

ఏపీలో ఇంటివద్దకే రేషన్
ఏపీలో గతంలో రేషన్ షాపుల ద్వారా పేదలకు రేషన్ పంపిణీ జరిగేది. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేషన్ ను ఇంటివద్దకే పంపాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యేకంగా వందల కోట్లు పెట్టి వాహనాలు కొనుగోలు చేసి మరీ రేషన్ ను ఇళ్ల వద్దకు పంపుతున్నారు. దీంతో కాలనీలకు వెళ్లి ఎక్కడో చోట ఈ వాహనం నిలిపి అందులో నుంచి రేషన్ పంపిణీ చేస్తున్నారు. ఆ వాహనాలు ఎక్కడ ఆగుతాయో తెలుసుకుని లబ్దిదారులు అక్కడికి వెళ్లి రేషన్ తీసుకుంటున్నారు. ఈ లెక్కన చూసినా ఇంటింటికీ రేషన్ చేరడం లేదు. అదే సమయంలో రేషన్ వాహనాల పేరుతో ప్రజాధనం వృథా అవుతోందంటూ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది.

స్కూళ్ల తరలింపులు
మరోవైపు రాష్ట్రంలో విద్యాసంస్కరణల్లో భాగంగా విద్యార్ధుల ఇంటికి దగ్గరగా ఉన్న వందల స్కూళ్లను ప్రభుత్వం ఎక్కడెక్కడికో మార్చేస్తోంది. వాగులు, వంకలు, దూరాభారంతో సంబంధం లేకుండా ఈ మార్పులు చేసేస్తోంది. దీంతో విద్యార్ధులు అంత దూరం వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం చెప్పినట్లు అక్కడికి వెళితేనే అమ్మఒడితో పాటు ప్రభుత్వం పథకాలు అందుతాయని షరతులు పెడుతోంది. దీంతో ఈ వ్యవహారంపై హైకోర్టు కీలక ప్రశ్నలు వేసింది.

పేదలు రేషన్ తెచ్చుకోలేరా ?
రేషన్ సరకులు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాటు చేసిన వాహనాలపై హైకోర్టు ప్రభుత్వానికి కీలక ప్రశ్నలు వేసింది. సరకులు పంపిణీ చేసినందుకు వాహనాల ద్వారా డోర్ డెలివరీ కోసం ప్రజాధనాన్ని భారీగా వినియోగిస్తున్నారని పేర్కొంది. ఈ చర్య ప్రజాధనాన్ని వృథా చేయడం కాదా అని నిలదీసింది. రాష్ట్రంలో పేదలు రేషన్ ను షాపుల నుంచి తెచ్చుకోలేని స్ధితిలో ఉన్నారా అని హైకోర్టు ప్రశ్నించింది. మొబైల్ వాహనం ఎప్పుడొస్తుందో తెలీక నిరుపేదలు, రోజుకూలీలు పనులు మానుకొని వేచి చూడాల్సి వస్తుందన్నారు. ఈ పథకం అమలు కోసం 92 వేల మందిని నియమించారని, వాహనదారుకు ఒక్కొక్కరికి నెలకు రూ.21 వేలు చెల్లిస్తున్నారన్నారు. వాహనాలు కొనడానికి రూ.600 కోట్లు ఖర్చు చేశారన్నారు. ఏజన్సీ ప్రాంతాల్లో కొండలు, గుట్టలు దాటి గిరిజనులు సరకులు తెచ్చుకోవాల్సి ఉంటుందని, అలాంటి ప్రాంతాల్లో వాహనాల ద్వారా సరుకులు సరఫరా చేస్తే అర్థం ఉంటుందని వ్యాఖ్యానించారు.

విద్యార్ధుల్ని అంతదూరం రమ్మంటారా ?
మరోవైపు రాష్ట్రంలో పాఠశాలల విలీనం పేరుతో 3, 4, 5 తరగతుల విద్యార్థులు మూడు కిలోమీటర్ల దూరం వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి కల్పిస్తున్న ప్రభుత్వం.... పక్కనే ఉన్న చౌకధరల దుకాణాలను కాదని వాహనాల ద్వారా ఇంటి వద్దే సరకులు ఇస్తామనడంలో హేతుబద్ధత ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. వీలు కుదిరినప్పుడు అరగంట సమయం కేటాయించి కి.మీ. దూరంలోని చౌకధరల దుకాణానికి వెళ్లి రేషన్ సరకులు తెచ్చుకోలేని స్థితిలో పేదలు లేరని తెలిపింది. సరకులు పంపిణీ చేసినందుకు రేషను డీలరుకు ఇచ్చే కమీషన్తో పోలిస్తే.. వాహనాల ద్వారా డోర్ డెలివరీ కోసం ప్రజాధనాన్ని భారీగా వినియోగిస్తున్నారని పేర్కొంది. ఈ చర్య ప్రజాధనాన్ని వృథా చేయడం కాదా అని నిలదీసింది. అలా వృథా చేసే సొమ్ముతో పేదప్రజలకు మరిన్ని సరకులు అందించొచ్చని అభిప్రాయపడింది.
సరకుల సరఫరా, చౌకదుకాణాల నిర్వహణకు నిధులిస్తున్న కేంద్ర ప్రభుత్వం నుంచి.. ఇంటింటికీ రేషన్ సరఫరాకు అనుమతి తీసుకున్నారా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఏ నిబంధనలను అనుసరించి వాహనాల ద్వారా ఇంటింటికీ సరకుల పంపిణీకి సిబ్బందిని నియమించారని అడిగింది.












Click it and Unblock the Notifications