వివేకా హత్యోదంతంపై సిట్ కు ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు: అలాంటివి చేయొద్దంటూ సూచనలు
అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై హైకోర్టు మంగళవారం విచారించింది. వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని అభ్యర్థిస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇదివరకే దాఖలు చేసిన పిటీషన్ తో పాటు తాజాగా వివేకా భార్య సౌభాగ్యమ్మ దాఖలు చేసిన పిటీషన్లను ఒకేసారి విచారణకు స్వీకరించింది. అనంతరం- ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఆదేశాలు జారీ చేసింది.
వైఎస్ వివేకా హత్యోదంతాన్ని విచారించడానికి రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి అమిత్ గర్గ్ నేతృత్వంలో ఓ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. వివేకా హత్యోదంతంలో సిట్ దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో.. హైకోర్టు కీలక ఆదేశాలు ఇవ్వడం చర్చనీయాంశమైంది.
వివేకా హత్యకేసులో నిష్పక్షపాత దర్యాప్తును కోరుతూ ఏపీ హైకోర్టులో మూడు పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. సిట్ విచారణపై నమ్మకం లేదని థర్డ్పార్టీ సంస్థతో విచారణ చేయించాలని పిటిషన్దారుల తరపు న్యాయవాది హైకోర్టును కోరారు. ఎన్నికల ముందు సిట్ దర్యాప్తు పేరిట మీడియా సమావేశాలు నిర్వహించి వైఎస్ కుటుంబ సభ్యులను కుట్రపూరిత ఆరోపణలు చేయాలని సిట్ చూస్తోందంటూ న్యాయవాది హైకోర్టులో వాదించారు.
ఎన్నికలు ముగిసే వరకు సిట్ ఎలాంటి ప్రెస్మీట్ పెట్టకుండా నిరోధించాలని కోర్టుకు విన్నవించారు. ఆయన వాదనతో ఏకీభవించిన హైకోర్టు ఎన్నికలు ముగిసేవరకు సిట్ మీడియా సమావేశాలు నిర్వహించొద్దని ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణ జరుపుకోవచ్చని సూచించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా వర్కింగ్ ప్రెసిడెంట్ అనిల్ ఈ పిటిషన్లను దాఖలు చేశారు.