ఏపీ హైకోర్టు జడ్జిలుగా నలుగురు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కు నలుగురు అదనపు న్యాయమూర్తులు నూనెపల్లి హరనాథ్, మండవ కిరణ్మయి, జగడం సుమతి, న్యాపతి విజయ్ నియమితులైన సంగతి తెలిసిందే. వారితో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు. విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో కార్యక్రమం జరిగింది.
ఏపీ హైకోర్టు సీజే, న్యాయమూర్తులు, సీఎం జగన్, కొత్త న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు, తదితరులు హాజరయ్యారు. ఈ నలుగురిని న్యాయవాదుల కోటా నుంచి న్యాయమూర్తులుగా నియమించారు. ఈమేరకు సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే.

వీరి నియామకానికి కేంద్ర న్యాయశాఖ ఈనెల 18న ఉత్తర్వులిచ్చింది. ఏపీ హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తుల పోస్టులకుగానూ ప్రస్తుతం 27 మంది ఉన్నారు. వీరిలో ఇద్దరు ఇతర రాష్ట్రాలకు బదిలీ కాగా, కర్ణాటక నుంచి జస్టిస్ నరేందర్ బదిలీపై ఏపీ హైకోర్టుకు వస్తున్నారు. కొత్తగా నియమితులైన నలుగురితో కలిపి రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరనుంది.
గవర్నర్ అబ్దుల్ నజీర్తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ అయ్యారు. రాజ్భవన్లో గవర్నర్ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. నవంబర్ 1న జరగనున్న వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డుల ప్రధానోత్సవానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ను ఆహ్వానించారు. వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనపరిచినవారికి ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా అర్హులను ఎంపిక చేశారు. ఈ భేటీ అనంతరం.. ఏపీ హైకోర్టు నూతన జడ్జీల ప్రమాణస్వీకారానికి సీఎం జగన్ హాజరయ్యారు.












Click it and Unblock the Notifications