రాజధానులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు-ఎవరొస్తారని ప్రశ్న-కోర్టు ముందుకు అధికారులు
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమై దాదాపు రెండేళ్లు కావస్తోంది. అయినా ఇప్పటికీ రాజధానుల వ్యవహారం న్యాయవివాదాల్లోనే నలుగుతోంది. హైకోర్టులో రాజధానులపై దాఖలైన పిటిషన్ల విచారణ తిరిగి ప్రారంభం కానే లేదు. ఈ సమయంలో హైకోర్టు చేసిన తాజా వ్యాఖ్యలు రాజధానులపై ప్రశ్నలు లేవనెత్తాయి. ఏపీ ఆర్ధిక పరిస్ధితిపైనా అనుమానాలు రేకెత్తించాయి. చివరికి హైకోర్టు అసహనం వ్యక్తం చేస్తూ ఆర్ధిక పరిస్ధితిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడం చర్చనీయాంశమైంది.

హైకోర్టు నోట మూడు రాజధానుల మాట
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియ మూలన పడిన నేపథ్యంలో అటు ప్రభుత్వం కానీ, ఇటు అమరావతి రైతులు కానీ చేసేందుకు ఏమీ లేదు. హైకోర్టులో రాజధానుల పిటిషన్లపై విచారణ జరిగి తుదితీర్పు వస్తే తప్ప ఈ వ్యవహారం ముందుకు కదిలే అవకాశం లేదు. కానీ అదే హైకోర్టులో మూడు రాజధానుల పిటిషన్ల విచారణ పెండింగ్లో ఉండగానే తాజాగా ఉన్నత న్యాయస్ధానం చేసిన కామెంట్లు ఆసక్తికరంగా మారాయి. ప్రభుత్వాన్ని మరో అంశంలో ప్రశ్నించే క్రమంలో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

అసలేం జరిగిందంటే ?
అసలు మూడు రాజధానుల విషయం హైకోర్టులో ప్రస్తావనకు రావడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా పెండింగ్లో పెట్టిన బిల్లులే. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం అప్పగించి పనులు చేసిన కాంట్రాక్టర్లకు ఇప్పటికీ పూర్తిగా బిల్లులు చెల్లించలేదు. దీంతో ఈ పిటిషన్పై విచారణ జరుపుతున్న హైకోర్టు.. దీనికి కారణమేంటని అధికారుల్ని ప్రశ్నించింది. ఈ క్రమంలో వారు ప్రభుత్వం వద్ద డబ్బులు లేవంటూ సమాధానం చెప్పారు. దీనిపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అదే సమయంలో మూడు రాజధానుల్ని లింక్ చేస్తూ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేసింది.

ఇక మూడు రాజధానులు ఎలా ?
ప్రభుత్వం రెండేళ్ల క్రితం పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడానికే డబ్పులు లేవని చెబుతుంటే ఇక మూడు రాజధానుల పరిస్ధితి ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. బిల్లులు సక్రమంగా చెల్లించలేకపోతే ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మూడు రాజధానుల నిర్మాణానికి ఎవరొస్తారంటూ కీలక ప్రశ్న వేసింది. దీంతో ప్రభుత్వ న్యాయవాదులు నీళ్లు నమలాల్సి వచ్చింది. అధికారుల వాదన వింటుంటే ఏపీ ఆర్ధిక పరిస్ధితి దయనీయంగా ఉన్నట్లు అనిపిస్తోందని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. అసలు ఏపీ ఆర్ధిక పరిస్ధితిపై సమగ్ర నివేదిక సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Recommended Video

స్వయంగా హాజరుకావాలన్న హైకోర్టు
ఎప్పుడో చేసిన పనులకు బిల్లులు చెల్లించకుండా ఆర్ధిక పరిస్ధితిని సాకుగా చూపడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి బాధ్యుల్ని చేస్తూ ఆర్ధికశాఖ, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శుల్ని ఈ నెల 28న స్వయంగా తమ ముందు హాజరుకావాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఏపీ ఆర్ధిక పరిస్దితిపై సమగ్ర నివేదికతో రావాలని వీరిద్దరినీ హైకోర్టు సూచించింది. అలాగే పిటిషనర్లు అయిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఎందుకు చెల్లించలేదో తెలియజేస్తూ అఫిడవిట్ కూడా దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.












Click it and Unblock the Notifications