జగన్ ఇంటి వద్ద కూల్చివేతలకు బ్రేక్-రేపటి వరకూ ఆపాలన్న హైకోర్టు
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇంటికి సమీపంలో అమరారెడ్డి కాలనీ వాసులు నివసిస్తున్నారు. గతంలో సీఎం జగన్ అధికారం చేపట్టకముందు నుంచే వారు ఇక్కడ ఉంటున్నారు. తాజాగా ఈ కాలనీలో ఇళ్లు కూల్చేందుకు అధికారులు ప్రయత్నించిన సమయంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దీంతో ఈ వ్యవహారం హైకోర్టుకు చేరింది. ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు కాలనీ వాసులకు తాత్కాలిక ఊరటనిచ్చింది.
గుంటూరు జిల్లా తాడపల్లిలోని సీఎం జగన్ క్యాంపు కార్యాలయం ముందు ఉన్న అమరారెడ్డి కాలనీ వాసుల్ని అక్కడి నుంచి మరో చోటికి పంపి ఇళ్లు కేటాయించేందుకు గతంలో స్ధానిక మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హామీ ఇచ్చారు. ఆ తర్వాత మున్సిపల్ అధికారులు ఒక్కసారిగా అక్కడికి చేరుకుని జేసీబీలతో కూల్చివేతలు చేపట్టారు. వీటిని నిరసిస్తూ విపక్ష పార్టీలతో కలిసి కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. చివరికి వారు హైకోర్టులో కూల్చివేతలకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశారు.

వాస్తవానికి సీఎం జగన్ భద్రత దృష్ట్యా కాలనీ వాసుల ఇళ్లు తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై అభ్యంతరాలు వ్యక్తం కావడం, హైకోర్టులో పిటిషన్ల నేపథ్యంలో ప్రభుత్వం వారికి ప్రత్యామ్నాయంగా ఇళ్లు కేటాయించాల్సిన పరిస్ధితి వచ్చింది. అయితే ప్రభుత్వం దీనిపై మీనమేషాలు లెక్కిస్తుండటం, కేటాయింపులో ఇబ్బందులతో ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. దీనిపై దాఖలైన పిటిషన్లను విచారించిన హైకోర్టు.. రేపటి వరకూ కూల్చివేతలు ఆపాలని ఆదేశాలు ఇచ్చింది. సోమవారం తదుపరి విచారణ చేపడతామని వెల్లడించింది.












Click it and Unblock the Notifications