వలస కూలీలపై ఏపీ సర్కారుకు హైకోర్టు కీలక ఆదేశాలు
అమరావతి: కరోనా లాక్డౌన్ నేపథ్యంలో వలస కూలీలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. వలస కార్మికులను స్వస్థలాలకు పంపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వారిని ఆదుకుని, నగదు, ఆహార భద్రత కల్పించాలని సూచించింది.
వలస కార్మికుల సమస్యలపై ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం.. వలస కార్మికులకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించింది.
హైకోర్టు తీర్పు పట్ల రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు.

వలస కార్మికులను ఆదుకోవాలని, వారికి ఆహర భద్రత కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగా, వలస కార్మికుల బాధ్యత రాష్ట్రాలే తీసుకోవాలని ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఆయా రాష్ట్రాల్లో ఉన్న వలస కార్మికులను తరలించేందుకు అవసరమైన సదుపాయాలను అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలే కల్పించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా సూచించారు.
చాలా మంది వలస కూలీలు కాలినడకన సొంతూర్లకు వెళుతున్నారని, వారంతా రోడ్లపై, రైల్వే పట్టాలపై నడవకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆహారంతోపాటు షెల్టర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆయన లేఖలు రాశారు. వలస కార్మికుల కోసం బస్సులు నడపాలని, వారికి అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం వైఎస్ జగన్ కూడా అధికారులను ఆదేశించారు. వారికి ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు.












Click it and Unblock the Notifications