ఏపీలో మరో పాదయాత్రకు హైకోర్టు అనుమతి-కడప ఉక్కు ఫ్యాక్టరీకి-రేపటి నుంచే.. !
ఏపీలో రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు చేపడుతున్న పాదయాత్రలకు ప్రభుత్వం వరుసగా అనుమతులు నిరాకరిస్తోంది. అయితే వారంతా తిరిగి హైకోర్టును ఆశ్రయించి అవే పాదయాత్రలకు అనుమతులు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు అదే క్రమంలో మరో పాదయాత్రకు హైకోర్టు ఇవాళ అనుమతి మంజూరు చేసింది.
రాష్ట్రంలో విభజన తర్వాత కేంద్రం ఇచ్చిన హామీల్లో ఒకటైన కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం గతంలో సీఎంలు చంద్రబాబు, జగన్ ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఎలాగైనా స్టీల్ ప్లాంట్ నిర్మించి తీరుతామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ ఆ హామీ అమలు కాలేదు. స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఇప్పటికీ ముందడుగు పడటం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాదయాత్రకు సిద్ధమయ్యారు.

కడప స్టీల్ ప్లాంట్ సాధన కోసం సీపీఐ రామకృష్ణ చేపట్టిన పాదయాత్రకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఇవాళ ఆయన పాదయాత్రకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన రేపటి నుంచి ఐదు రోజుల పాటు పాదయాత్ర చేపట్టబోతున్నారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం ఈ నెల 9 నుండి 13 వరకు రామకృష్ణ పాదయాత్ర చేపట్టారు.
ఈ పాదయాత్రకు అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు మద్దతిస్తున్నాయి.












Click it and Unblock the Notifications