నిమ్మగడ్డకు ఏపీ హైకోర్టులో అనూహ్య షాక్: తొలిదశ పంచాయతీ పోలింగ్ వరకు బ్రేక్
అమరావతి: రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం సన్నద్ధమౌతోన్న ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగలింది. ఎన్నికల నిర్వహణ, పోలింగ్ వ్యవస్థను పర్యవేక్షించడానికి వరుసగా జిల్లాల పర్యటనలతో దూకుడుగా వ్యవహరిస్తోన్న ఆయనకు హైకోర్టు అనూహ్యంగా షాక్ ఇచ్చింది. ఎన్నికల పర్యవేక్షణ కోసం ఆయన అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రైవేట్ యాప్ ఈ-వాచ్ వినియోగానికి హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. పర్యవేక్షణణ కోసం సొంతంగా చర్యలను తీసుకోవాల్సిన ఎన్నికల కమిషన్ కార్యాలయం.. ఓ ప్రైవేట్ యాప్ మీద ఆధారపడటాన్ని తప్పు పట్టింది.
ఈ-యాప్ను అమలులోకి తీసుకుని రావొద్దంటూ ఆదేశాలను జారీ చేసింది. ఈ నెల 9వ తేదీ వరకు దీన్ని వాడొద్దని పేర్కొంది. ఆ తేదీ నుంచే రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కాబోతోన్న విషయం తెలిసిందే. తొలి విడత పోలింగ్ నిర్వహించే 9వ తేదీ వరకు యాప్ను వినియోగించొద్దంటూ హైకోర్టు సూచించింది. దీనిపై తదుపరి విచారణనను 9వ తేదీకి వాయిదా వేసింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకొచ్చిన ఈ-వాచ్ యాప్పై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిటీషన్ను ఏపీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. శుక్రవారం వాదోపవాదాలను ఆలకించింది.

ఈ-వాచ్ ప్రైవేట్ యాప్ అని, ఎన్నికల కమిషన్ వంటి రాజ్యాంగబద్ధ కమిషన్.. ఓ ప్రైవేటు యాప్ మీద ఆధారపడటం సహేతుకం కాదంటూ పిటీషన్ తరఫు న్యాయవాది వాదించారు. ఎన్నికల కమిషన్ సొంతంగా ప్రభుత్వ నెట్వర్క్ను కలిగి ఉందని, గ్రామస్థాయిలో అధికార యంత్రాంగాన్ని వినియోగించుకునే అధికారాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇది దుర్వినియోగం కావడానికి అవకాశాలు ఉన్నాయని న్యాయవాది అనుమానాలను వ్యక్తం చేశారు. ఇదివరకు ఎస్ఈసీకి సొంతంగా యాప్ ఉన్నప్పటికీ.. దాని స్థానంలో ఈ-వాచ్ను వినియోగించడం సబబు కాదని పేర్కొన్నారు.
Recommended Video

ఆయన వాదనలతో ఏకీభవించిన హైకోర్టు న్యాయమూర్తులు.. ఈ నెల 9వ తేదీ వరకు దాని అమలును నిలిపివేయాలని ఆదేశించారు. తదుపరి విచారణను అదే రోజుకు వాయిదా వేశఆరు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడానికే దీన్ని తీసుకొచ్చామని ఎస్ఈసీ వాదించింది. ఎన్నికలకు సంబంధించినంత వరకు గ్రామస్థాయిలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించడానికి, వాటిని అప్పటికప్పుడు పరిష్కరించేలా జిల్లా పాలనా యంత్రాంగాన్ని ఆదేశించేలా కాల్ సెంటర్ను కూడా నెలకొల్పిన విషయాన్ని గుర్తు చేసింది.












Click it and Unblock the Notifications