జస్టిస్ చంద్రు వ్యాఖ్యలపై హైకోర్టు ఫైర్- మొత్తం కోర్టును నిందిస్తారా ? సినిమా తీయించుకోండి..
ఏపీలో వైసీపీ సర్కార్ వర్సెస్ గా గతంలో సాగిన వివాదంలో భాగంగా చోటు చేసుకున్న పరిణామాల్ని తాజాగా మద్రాస్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రు తప్పుబట్టారు. ముఖ్యంగా వైజాగ్ ఘటనతో పాటు అమరావతి భూముల స్కాం వంటి వ్యవహారాల్ని ప్రస్తావిస్తూ ఏపీ హైకోర్టు తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారం కాస్తా హైకోర్టుకు చేరడంతో ఇవాళ రాష్ట్ర అత్యున్నత న్యాయస్ధానం ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించింది.
జస్టిస్ చంద్రు కామెంట్స్
తాజాగా విజయవాడలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన మద్రాస్ హైకోర్టు మాజీ ఛీఫ్ జస్టిస్ చంద్రు ఏపీ హైకోర్టును ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భావిస్తున్న హైకోర్టు నిర్ణయాలపై ఆయన నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తుల తీర్పుల్ని, వారి వ్యవహారశైలిని తప్పుబట్టారు. ఏపీ హైకోర్టు తన పరిధిని దాటి వ్యవహరిస్తోందన్నారు. అలాగే ఏపీ ప్రభుత్వం శత్రుృవులు, ప్రత్యర్ధులతో కాకుండా న్యాయవ్యవస్ధతో యుద్ధం చేయాల్సి వస్తోందన్నారు. దీంతో జస్టిస్ చంద్రు వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి.
చంద్రు వ్యాఖ్యలపై స్పందించిన హైకోర్టు
ఏపీ హైకోర్టును ఉద్దేశించి జస్టిస్ చంద్రు చేసిన సంచలన వ్యాఖ్యలపై ఇవాళ హైకోర్టు స్పందించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రాతో పాటు మరో న్యాయామూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ చంద్రు వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. చంద్రు తీరుపై స్పందిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే చంద్రుకు పలు సూచనలు కూడా చేశారు. హైకోర్టును నిందించడంపై జస్టిస్ దేవానంద్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. అయితే చంద్రుపై ఎలాంటి చర్యలు తీసుకునే అంశాన్ని మాత్రం ప్రస్తుతానికి వదిలిపెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ సందర్భంగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి.
మేమూ మనుషులమేనన్న హైకోర్టు సీజే
జస్టిస్ చంద్రు వ్యాఖ్యలపై హైకోర్టు సీజే ప్రశాంత్ కుమార్ మిశ్రా అసహనం వ్యక్తం చేశారు. కొంతమంది జ్యుడిషియల్ సెలబ్రిటీలు లైమ్ లైట్ లో ఉండేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ఆక్షేపించారు. తాము మనుషులమే అని కొన్ని తప్పులు జరుగుతుంటాయన్నారు. మానవహక్కుల్ని కాపాడేందుకు వచ్చిన జస్టిస్ చంద్రు వాటి గురించి మాట్లాడితే బావుండేదన్నారు.
తాము పరిధి దాటి మాట్లాడామని చెప్పడం సరికాదన్నారు.
Recommended Video
డైరెక్టర్ తో సినిమా తీయించుకోండన్న జస్టిస్ దేవానంద్
దేశంలోని ఇతర హైకోర్టులతో పోలిస్తే ఏపీ హైకోర్టులో కనీస సౌకర్యాలు లేదని మరో న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ తెలిపారు.
హైకోర్టు న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదిస్తుంటే సీబీఐ విచారణకు ఆదేశించడం తప్పా అని జస్టిస్ చంద్రుని ప్రశ్నించారు. ఎంతో మంది ప్రాధమిక హక్కులను కాపాడుతున్నామని, జస్టిస్ చంద్రు వ్యాఖ్యలు నిరాధారమని బట్టు దేవానంద్ తెలిపారు. మొత్తం హైకోర్టును ఎలా నిందిస్తారని జస్టిస్ చంద్రుని ప్రశ్నించారు. విశాఖలో ఓ డాక్టర్ ను పోలీసులు రోడ్డుపై విచక్షణా రహితంగా కొట్టారని, హక్కుల గురించి పోరాడాలంటే విశాఖకు వెళ్లాలని, మంచి డైరెక్టర్ తో సినిమా తీయించాలని జస్టిస్ చంద్రుకు జస్టిస్ బట్టు దేవానంద్ సూచించారు.