కేబినెట్ లోకి మరో డిప్యూటీ సీఎం, స్పీకర్ మార్పు- ముహూర్తం..!?
తెలంగాణ మంత్రివర్గంలో మార్పులకు రంగం సిద్దం అవుతోంది. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ ప్రతిపాదన పైన ఏఐసీసీ ఫోకస్ చేసింది. సీఎం రేవంత్ ఛాయిస్ మేరకు మార్పులతో పాటుగా చేర్పుల దిశగా కసరత్తు జరుగుతోంది. రాష్ట్రంలో సామాజిక సమీకరణాలు.. భవిష్యత్ లెక్కల అంచనాలతో మార్పులు చేపడుతున్నారు. మరో డిప్యూటీ సీఎం పదవి తెర పైకి వచ్చింది. స్పీకర్ ను కేబినెట్ లోకి తీసుకోవాలనే ఆలోచన నడుస్తోంది. దీంతో.. కేబినెట్ లో ఇన్ - ఔట్ పైన అంచనాలు మొదలయ్యాయి.
తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నారేళ్ల కాలం పూర్తయింది. మంత్రివర్గంలో ఒక సారి ఇద్దరికి.. జూబ్లీహిల్స్ బై పోల్ వేళ అజాహరుద్దీన్ కు అవకాశం దక్కింది. మరో రెండు మంత్రి పదవులు భర్తీ చేసుకునే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఇద్దరు.. ముగ్గురు మంత్రులు ఉద్వాసన పలుకుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఎక్కడా సామాజిక సమీకరణాలు దెబ్బ తినకుండా .. అందరికీ ప్రాధాన్యత ఇస్తూ కేబినెట్ ప్రక్షాళన దిశగా కసరత్తు కొనసాగుతోంది. ఇదే సమయంలో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ను కేబినెట్ లోకి తీసుకొని.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ఉన్నారు. బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో మరో డిప్యూటీ సీఎం పదవి ఇస్తారనే అంచనాలు పెరుగుతున్నాయి. ఇదే సమయంలో స్పీకర్ ను కేబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ నెలాఖరులో విస్తరణకు అవకాశం..!
ఇప్పటికే డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్కు ఉప సభాపతి పదవి ఇవ్వాలని నిర్ణయించారు. బీసీలకు మంత్రి పదవి కేటాయిస్తే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముందు వరుసలో ఉన్నారు. కాగా, మున్నూరు కాపు సామాజిక వర్గానికి ప్రాతినిథ్యం కల్పించే కోణంలో ఆయన పేరును పరిశీలన లో ఉన్నట్లు తెలుస్తోంది. లంబాడీ సమాజానికి అవకాశం ఇవ్వాలనే డిమాండ్లూ ఉన్నాయి. మంత్రి పదవుల భర్తీతో పాటు శాఖల పునర్ వ్యవస్థీకరణ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మంత్రుల పనితీరుపై మదింపు జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు సమయంలో భట్టి మాత్రమే డిప్యూటీ సీఎంగా ఉంటారని పార్టీ నాయకత్వం హామీ ఇచ్చింది. ఇప్పుడు బీసీ డిప్యూటీ సీఎం పదవి తెర మీదకు వస్తోంది. దీంతో.. కాంగ్రెస్ నాయకత్వం మంత్రివర్గ ప్రక్షాళనలో ఎలాంటి ఫార్ములా అమలు చేస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications