హైకోర్టులో మాజీ మంత్రి నారాయణకు రిలీఫ్
పదోతరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో మాజీ మంత్రి నారాయణకు రిలీఫ్ లభించింది. కేసు పూర్వాపరాల ఆధారంగా తిరిగి విచారణ జరపాలని చిత్తూరు సెషన్స్ కోర్టునకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ కేసుకు సంబంధించి నారాయణ బెయిల్ ను అక్టోబర్ 31న రద్దు చేస్తూ చిత్తూరు జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది. నవంబర్ 30వ తేదీలోగా కోర్టుకు హజరుకావాలని ఆదేశించింది. సెషన్స్ కోర్టు ఆదేశాలను నారాయణ హైకోర్టులో సవాల్ చేశారు.
తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని క్వాష్ పిటిషన్ లో కోరారు. చిత్తూరు కోర్టు ఇచ్చిన అరెస్ట్ రద్దు ఆదేశాలను పక్కన పెట్టింది. ప్రభుత్వం హైకోర్టులో రివిజన్ పిటిషన్ వేసింది. విచారణ సందర్భంగా నారాయణ తరఫు న్యాయవాది రివిజన్ పిటిషన్ కు విచారణ అర్హత లేదని తేల్చారు. కేసు పూర్వాపరాల ఆధారంగా తిరిగి విచారణ జరపాలని చిత్తూరు సెషన్స్ కోర్టును ఆదేశించింది.
ఈ ఏడాది పదో తరగతి పరీక్షల సమయంలో పలు చోట్ల ప్రశ్నా పత్రాలు లీకయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం తీవ్ర కలకలాన్ని రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, నారాయణ విద్యాసంస్థల్లో పని చేసే ఓ ఉపాధ్యాయుడే ప్రశ్నాపత్రాలను లీక్ చేసినట్లు తేలింది. పలువురు ఉపాధ్యాయులను అరెస్టు చేసిన తర్వాత వారిని విచారించారు. అనంతరం నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణను అదుపులోకి తీసుకుని చిత్తూరు కోర్టులో హజరుపరిచారు.
ప్రస్తుతం నారాయణ విద్యాసంస్థ బాధ్యతలు ఆయన చూడటం లేదని, నారాయణ చైర్మన్ పదవికి గతంలోనే రాజీనామా చేశారని కోర్టుకు తెలియజేసింది. అందుకు సంబంధించిన పత్రాలను కూడా సమర్పించడంతో కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. నారాయణకు బెయిల్ ఇవ్వడాన్ని చిత్తూరు వన్ టౌన్ పోలీసులు సవాల్ చేశారు. పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై చిత్తూరు సెషన్స్ కోర్టు విచారణ జరిపి నారాయణకు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేసింది.