AP Police: ఏపీ పోలీసులపై హైకోర్టు ఫైర్.! పోసాని కేసులో కీలక ఆదేశాలు
వైసీపీ నేత పోసాని కృష్ణమురళి అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో ఏపీ పోలీసులకు హైకోర్టు షాకిచ్చింది. పోసాని వ్యాఖ్యలపై పోలీసులు నమోదు చేసి కేసు, వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విషయంలో ఏం చేయాలో పోలీసులకు మార్గదర్శనం చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోసానిని వరుస కేసులతో టార్గెట్ చేస్తున్న పోలీసులకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడిపై పోసాని కృష్ణమురళి చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆయనకు సూళ్లూరుపేట పోలీసులు సీఆర్పీసీ సెక్షన్ 111 కింద నోటీసులు జారీ చేశారు. దీనిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది శాంతిని కాపాడటానికి ఉద్దేశించిన సెక్షన్ అని, కానీ ఇప్పుడు బెదిరింపు సాధనంగా పోలీసులు మార్చుకోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సెక్షన్ ను దుర్వినియోగం చేస్తున్నారని పోలీసులపై మండిపడింది.

హైకోర్టు తన ఆదేశాలను పదేపదే ధిక్కరిస్తున్నందుకు, రాజ్యాంగ రక్షణలను ధిక్కరించినందుకు పోలీసు శాఖను తప్పుబట్టింది. సరైన ఆధారాలు లేకుండా పోసాని కృష్ణ మురళిపై అధికారులు తరచూ నోటీసులు జారీ చేస్తున్నారని, ఆయనను, ఆయన కుటుంబాన్ని మానసికంగా హింసించారని కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గతంలో తమ ఆదేశాలు ఉన్నప్పటికీ, చట్టపరంగా అవసరమైన విధంగా, ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ను ప్రమేయం లేకుండా, గుంటూరు పోలీసులు పోసాని కృష్ణ మురళికి సెక్షన్ 111 CrPC కింద కనీసం పది వేర్వేరు నోటీసులు జారీ చేయడాన్ని తప్పుబట్టింది.
న్యాయపరమైన ఆదేశాలను పోలీసులు ఇలా నిర్లక్ష్యం చేయడాన్ని సహించబోమని పోలీసులను హెచ్చరించింది. పోలీసులు ఇప్పటికైనా న్యాయవ్యవస్థ అధికారాన్ని గౌరవిస్తారా అని ప్రశ్నించింది. వారి చర్యలు "నియంతృత్వాన్ని తలపిస్తున్నాయని తెలిపింది. ఇలాంటి విధానాల్ని ఎలా ఆపుతారో వివరిస్తూ అఫిడవిట్లు దాఖలు చేయాలని రాష్ట్ర హోం శాఖ, సీనియర్ పోలీసు అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఉల్లంఘనలు కొనసాగితే కోర్టు ధిక్కార చర్యలు ప్రారంభిస్తామని హెచ్చరించింది.












Click it and Unblock the Notifications