జగన్ సర్కారుకు హైకోర్టు షాక్- గుంటూరు పీఎస్పై దాడి కేసులో కీలక ఆదేశాలు- ఎన్ఐఏ దర్యాప్తు ?
ఏపీలో గతేడాది అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం టీడీపీ హయాంలో చోటు చేసుకున్న ఓ ఘటనకు సంబంధించి జారీ చేసిన జీవో వివాదాస్పదమైంది. దీన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించిన హైకోర్టు.. స్టే ఉత్తర్వులు జారీ చేయడమే కాకుండా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. అలాగే జాతీయ దర్యాప్తు సంస్దను కూడా ప్రతివాదిగా చేర్చాలంటూ మరో కీలక ఆదేశం కూడా జారీ చేసింది. దీంతో ఈ కేసు మరో మలుపు తిరగబోతోంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో మండిపడుతున్న బీజేపీ నేతలతో పాటు ఈ కేసు నమోదు చేసిన టీడీపీకి కూడా హైకోర్టు ఆదేశాలు వారికి ఊరటనిచ్చాయి.

జగన్ సర్కారుకు మరో ఎదురుదెబ్బ...
2018లో పాత గుంటూరు పీఎస్పై కొందరు ముస్లిం యువకులు దాడి చేసిన వ్యవహారంలో కేసులను ఉపసంహరిస్తూ వైసీపీ ప్రభుత్వం
తీసుకున్న నిర్ణయంపై బీజేపీ నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఇదే అంశంపై లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరంకు చెందిన గణేశ్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిల్పై హైకోర్టు విచారణ జరిపింది. పాత గుంటూరు పీఎస్పై దాడి కేసును ఉపసంహరిస్తూ జగన్ సర్కారు జారీ చేసిన ఆదేశాలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసులు ఉపసంహరిస్తూ జారీ చేసిన జీవోపై స్టే ఇవ్వడమే కాకుండా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కేసు విచారణను వచ్చే నెల 15కు వాయిదా వేసింది.

టీడీపీ హయాంలో కేసు...
2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో పోలీసులు అక్రమ కేసులు బనాయించారంటూ పాత గుంటూరు పోలీసు స్టేషన్పై కొంతమంది ముస్లిం యువకులు దాడి చేశారు. ఈ వ్యవహారంపై అప్పటి టీడీపీ ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. వీటిపై అప్పట్లో నిరసన వ్యక్తం చేసిన వైసీపీ నేతలు.. తాము అధికారంలోకి రాగానే కేసులు ఎత్తేస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. అన్నట్లుగానే వైసీపీ అధికారంలోకి రాగానే కేసులను ఉపసంహరించుకునేలా ఈ ఏడాది ఫిబ్రవరిలో స్టేషన్ హౌస్ ఆఫీసర్కు, పబ్లిక్ ప్లాసిక్యూటర్లకు ఆదేశాలు ఇస్తూ ప్రభుత్వం జీవో నంబర్ 776 జారీ చేసింది. దీనిపై దాఖలైన ప్రజాప్రయోజన వాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు దీనిపై స్టే ఇచ్చింది.

హైకోర్టు సీరియస్- ఎన్ఐఏ దర్యాప్తు చేయిస్తామంటూ...
పాత గుంటూరు పీఎస్పై జరిగిన దాడి కేసులో ప్రాసిక్యూషన్ ఉపసంహరిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రజాప్రయోజనాలకు విరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. ఇది ఇలాంటి నేరాలు పునరావృతం అయ్యేందుకు అవకాశం కల్పిస్తోందని తెలిపారు. దీనిపై స్వతంత్ర సంస్దతో దర్యాప్తు చేయించాలని కోరారు. వాదనలు విన్న జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ ఉమాదేవి ధర్మాసనం జీవోలో భాషను సైతం తప్పుబట్టింది. లాకిక, ప్రజాస్వామ్య దేశంలో ఉంటూ జీవోలో నేరుగా ముస్లిం యువత అని పేర్కొనడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. ఈ పిటిషన్లో తీవ్రత దృష్ట్యా ఎన్ఐఏను ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్కు సూచించింది.












Click it and Unblock the Notifications