నిమ్మగడ్డకు హైకోర్టు షాక్- రేషన్ వాహనాల వాడకంపై- జగన్ సర్కార్కు ఊరట
ఏపీలో ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన రేషన్ పంపిణీ వాహనాల వాడకానికి పంచాయతీ ఎన్నికల కోడ్ కారణంగా గతంలో బ్రేక్ పడింది. అయితే ఎన్నికల కారణంగా రేషన్ పంపిణీకి వాహనాలు వాడకుండా ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు ఇవాళ సస్పెండ్ చేసింది. రేషన్ వాహనాల వాడకంపై ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే ఇచ్చింది.
నిమ్మగడ్డతో జగన్ సర్కార్ రాజీ ? మార్చిలోపే అన్ని ఎన్నికలు- అసలు కారణాలివేనా ?
ఏపీలో నెలవారీ రేషన్ పంపిణీ కోసం ప్రభుత్వం రూ.500 కోట్లకు పైగా ఖర్చుపెట్టి కొత్త వాహనాలు కొనుగోలు చేసింది. వీటికి వైసీపీ రంగులు కూడా వేశారు. అలాగే సీఎం జగన్ ఫొటోను కూడా ముద్రించారు. గత నెలలో సీఎం జగన్ వీటికి విజయవాడలో ప్రారంభోత్సవం కూడా చేశారు. కానీ పంచాయతీ ఎన్నికలు రావడంతో గ్రామాల్లో వీటిని వినియోగించకుండా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ నిషేధించారు. నాలుగు వారాల పాటు వీటిని గ్రామాల్లో తిప్పడానికి వీల్లేదని ఆదేశాలు ఇచ్చారు.
ఎస్ఈసీ ఆదేశాలపై ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. అయితే ఎస్ఈసీ పరిశీలన తర్వాత వీటిని వాడుకోవచ్చని గతంలో హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే ఈ వాహనాలను స్వయంగా పరిశీలించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ సీఎం జగన్ ఫొటో ఉందన్న కారణంతో అనుమతి ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో ప్రభుత్వం మరోసారి హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు.. రేషన్ వాహనాలను అడ్డుకోవడం సరికాదని తేల్చిచెప్పింది. ప్రజలకు నిత్యావసరాలు సరఫరా చేసే వీటిపై నిషేధాన్ని తప్పుబట్టింది. దీనిపై గతంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ ఇచ్చిన ఆదేశాలను సస్పెండ్ చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.