ఏపీలో భారీగా జడ్డీల బదిలీలు-62 మందికి స్ధానచలనం-మరోవైపు ఖాళీల భర్తీ
ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా 62 మంది జూనియర్ సివిల్ జడ్జిలను బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో పలు జిల్లాల్లో ఉన్న జడ్డీలను మరో జిల్లాలకు, మరో ప్రాంతాలకు కూడా బదిలీ చేశారు. అలాగే ఖాళీగా ఉన్న జడ్డీల పోస్టుల్లో నియామకాలు కూడా జరిగాయి. ఇంత భారీ స్ధాయిలో జరిగిన బదిలీలు చర్చనీయాంశమయ్యాయి.
ఏపీలో మూడురోజుల క్రితమే 68 జూనియర్ సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. నేరుగా నియామకం ద్వారా 55, బదిలీల ద్వారా 13 పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే ఇంత తక్కువ వ్యవధిలోనే 62 మంది జడ్డీల్ని బదిలీ చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకోవడం విశేషం. బదిలీ అయిన న్యాయమూర్తులను ఆగస్టు 3లోగా తమ కొత్త న్యాయస్ధానాల్లో చేరాలని, ఆ లోపే పెండింగ్ లో ఉన్న కేసుల్ని పరిష్కరించాలని హైకోర్టు తమ ఉత్తర్వుల్లో పేర్కొంది.
మరోవైపు తాజాగా జారీ అయిన జూనియర్ సివిల్ జడ్డీల ఖాళీల భర్తీ నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తుతో పాటు ప్రకటనకు సంబంధించిన పూర్తి వివరాలు హైకోర్టు అధికారిక వెబ్ సైట్లో ఉంచారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు సమర్పించేందుకు చివరి తేది ఆగస్టు 20 అని హైకోర్టు రిజిస్ట్రార్ సునీత పేర్కొన్నారు.
Recommended Video
వారం క్రితం రాష్ట్రంలోని వివిధ న్యాయస్థానాల్లో పనిచేస్తున్న 25 మంది సీనియర్ సివిల్ జడ్జీల బదిలీ అయ్యింది. ఇప్పుడు జూనియర్ జడ్డీల బదిలీ జరగడంతో న్యాయవ్యవస్ధలో ప్రక్షాళనకు హైకోర్టు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే ఖాళీల భర్తీపైనా దృష్టిసారిస్తోంది.