జగన్ చెక్కు ఇంకా అందలేదు-హోంమంత్రి అనిత సెటైర్లు..!
ఏపీ శాసనమండలిలో ఇవాళ వైసీపీ ఎమ్మెల్సీలు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చే క్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత ఇవాళ వైఎస్ జగన్ పై సెటైర్లు వేశారు. విజయవాడ వరదలకు ప్రభుత్వం అందించిన సాయం లక్షల మందికి రాలేదంటూ వైసీపీ ఎమ్మెల్సీలు ప్రభుత్వాన్ని నిలదీశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన హోంమంత్రి.. జగన్ ను టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
వరదబాధితులకు సాయంపై శాసనమండలిలో హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటన చేశారు. వరద సాయంపై బాధితులు వస్తే కలెక్టర్ల ద్వారా ఇప్పటికీ పరిష్కరిస్తున్నామని తెలిపారు. వరద బాధితులకు నేరుగా సాయాన్ని వారి ఖాతాలకే నగదు బదిలీ చేశామని తెలిపారు. వరద బాధితులు ఇంకా లక్షల మంది ఉన్నారన్న వైసీపీ ఎంఎల్సీల మాటలపై ఆగ్రహం వ్యక్తం చేసిన హోంమంత్రి..జగన్ ఇచ్చిన రూ.కోటి సాయంపై కమిటీ వేద్దామా అంటూ కౌంటర్ ఇచ్చారు.
అబద్ధాలు మాట్లాడేముందు ఆర్టీఐ ద్వారా నిజానిజాలు తెలుసుకోవాలని వైసీపీ ఎమ్మెల్సీలకు హోంమంత్రి సూచించారు.పెద్దల సభ అంటే పెద్ద పెద్ద అబద్ధాలు మాట్లాడాలని వైసీపీ సభ్యులు భావిస్తున్నారని మండిపడ్డారు. అబద్ధాలు మాట్లాడితే సాక్షిలో ప్రచురిస్తారని ఏది పడితే అది మాట్లాడొద్దని హోంమంత్రి వారికి సలహా ఇచ్చారు. విజయవాడ వరదబాధితులను ఆదుకోవడానికి రూ.497.07 కోట్లు విరాళంగా వచ్చిందని ఈ సందర్భంగా తెలిపారు.

సెప్టెంబర్ 2024 నుంచి ఫిబ్రవరి 16,2025 వరకూ స్వీకరించిన విరాళాలు (చెక్కులు, ఆన్ లైన్ ద్వారా కలిపి) రూ.317.09 కోట్లని, పీడీ ఖాతాల ద్వారా ఉద్యోగుల విరాళాలు రూ.143.79 కోట్లని, సీఎంఆర్ఎఫ్ కోసం వచ్చిన సీఎస్ఆర్ నిధులు రూ.36.189 కోట్లని తెలిపారు. విరాళాలలో నుంచి రూ.274.95 కోట్లతో వరద బాధితులకు ఆర్థిక సాయం, ఉపశమన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రూ.271.63 కోట్ల మొత్తాన్ని గ్రామ,వార్డు సచివాలయాల శాఖ సంబంధిత జిల్లా కలెక్టర్ నుంచి డీబీటీ పద్ధతిలో వరద బాధితులకు నేరుగా సాయం చేశామన్నారు.
విపత్తు నిర్వహణ కమిషనర్, ఎక్స్ అఫీషియో, ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఖాతాకు బదిలీ చేశామని హోంమంత్రి తెలిపారు.రూ.3.60 లక్షలను ఇతర సాంకేతిక, సహాయక అవసరాలకు వినియోగించినట్లు పేర్కొన్నారు. బుడమేరులో ఆక్రమణల వల్లే వరద వచ్చిందన్నారు. 2005లో వచ్చిన భారీ వరదలు విజయవాడను ముంచెత్తాయని, రూ.464 కోట్లతో బుడమేరు డైవర్షన్ ఛానల్ సామర్థ్యాన్ని 35వేల క్యూసెక్కులు పెంచే పనులు గత ప్రభుత్వం కొనసాగించలేదన్నారు. గత ప్రభుత్వం ముఖ్యమైన పనులు పెండింగ్ లో పెట్టడంవల్లే ఈ పర్యావసనాలు అని హోంమంత్రి ఆరోపించారు.
11 రోజులపాటు విజయవాడ ప్రజలు సాధారణజీవితంలోకి వచ్చేవరకూ సీఎం చంద్రబాబు బస్ లో ఉండి పరిపాలన సాగించారన్నారు. అగ్గిపెట్టెలు, కొవ్వొత్తుల ఏర్పాట్లపై ఎగతాళి మాటలు మాట్లాడడంపై హోంమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.కరెంట్ లేక చీకట్లో నిలువెత్తు నీళ్లలో ప్రజలు ఇబ్బందులు పడుతుండడం కళ్లారా చూసి ఆదుకున్నామన్నారు. ఏ నెలలో ఎంతెంత, ఏ రంగానికి ఎంతిచ్చాం వివరాలన్నీ లిఖిత పూర్వక సమాధానంలో వెల్లడించామన్నారు. వరదకు దెబ్బతిన్న ప్రతి మనిషిని,ఇంటిని, సామాగ్రికి సాయమందించామన్నారు.












Click it and Unblock the Notifications