'రోజా టిడిపిలో చేరే ఛాన్సుందా': క్షమాపణ చెప్పకుంటే... అంతేనా!
హైదరాబాద్: ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొందరు టిడిపి వైపు చూస్తున్నారు. అందులో వైసిపి మహిళా ఎమ్మెల్యే రోజా పేరు కూడా వినిపిస్తోన్న విషయం తెలిసిందే. రోజాను టిడిపిలోకి చేర్చుకునేందుకు ఆ పార్టీ ప్రయత్నించిందనే ఊహాగానాలు వినిపించాయి.
ఇలాంటి పరిస్థితుల్లో రోజా అంశంపై టిడిపి నేత జూపూడి ప్రభాకర రావుకు విలేకరులు ఆసక్తికర ప్రశ్న వేశారు. దీనిపై ఆయన తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. 'రోజా తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలున్నాయా' అని విలేకరులు జూపూడిని శనివారం ప్రశ్నించారు.
దానికి జూపూడి స్పందిస్తూ... అలాంటి అవకాశముంటే పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని, అది పార్టీ హైకమాండుకు చటెందిన అంశమని చెప్పారు.
రోజా సారీ చెప్పాల్సిందేనా?
వైసిపి నేత రోజాకు ఏపీ శాసనసభాహక్కుల సంఘం మరోసారి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల ఆరోవ తేదీన తమ ముందు హాజరుకావాలని పేర్కొంది. టిడిపి ఎమ్మెల్యే అనిత ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరుగుతుందని తెలిపింది.
గతంలో నాలుగుసార్లు రోజాకు సభాహక్కుల సంఘం నోటీసులిచ్చింది. ఒకసారి సమయం కావాలని, మరోసారి ఢిల్లీలో న్యాయస్థానం పనిలో ఉన్నానని ఆమె చెప్పారు. హైకోర్టు ఆమె సస్పెన్షన్పై తీర్పు ఇవ్వడం, తర్వాత డివిజన్ బెంచ్ ఆ తీర్పును కొట్టివేయడం తెలిసిందే.
ఈ నేపథ్యంలో క్షమాపణ చెప్పేందుకు రోజాకు మరోసారి అవకాశం ఇవ్వాలని శాసనసభ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆరో తేదీన హాజరుకావాలని శాసనసభ కార్యదర్శి సత్యనారాయణ సభాహక్కుల సంఘం తరఫున ఆమెకు నోటీసులు పంపారు. అయితే, రోజా క్షమాపణలు చెప్పకుంటే మాత్రం ఆమెపై చర్యలు కొనసాగించేందుకు టిడిపి సిద్ధంగా ఉందని అంటున్నారు.