ఏపీ ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి: తొలి స్థానంలో కృష్ణా, చివరి స్థానంలో కడప
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. మంత్రి గంటా శ్రీనివాస రావు వీటిని విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 73.33 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో బాలుర కంటే బాలికలు ముందున్నారు. ఫలితాల్లో కృష్ణా జిల్లా (84 శాతం) మొదటి స్థానంలో ఉండగా, కడప (56 శాతం) చివరి స్థానంలో నిలిచింది.
కృష్ణా జిల్లాలో 85 శాతం మంది అమ్మాయిలు, 83 శాతం మంది బాలురు, ఎస్పీఎస్ నెల్లూరులో 80 శాతం మంది అమ్మాయిలు, 75 శాతం మంది బాలురు, గుంటూరులో 80 శాతం మంది బాలికలు, 72 శాతం మంది అబ్బాయిలు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో చివరిస్థానంలో కడప నిలిచింది. కడపలో 67 శాతం మంది అమ్మాయిలు 61 శాతం మంది అబ్బాయిలు ఉత్తీర్ణత సాధించారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల విషయానికి వస్తే మొదటి స్థానంలో విజయనగరం జిల్లాలో 80 శాతం అమ్మాయిలు ఉత్తీర్ణత సాధించారు.
ఎంపీసీలో 992 మార్కులతో తేజవర్ధన్ రెడ్డి ప్రథమ స్థానంలో నిలిచారు. రెండో స్థాన్లో అఫ్రాన్ షేక్ (991), మూడో స్థానంలో వాయలపల్లి సుష్మ (990) నిలిచారు.
బైపీసీలో ముక్కు దీక్షిత (990) మొదటి స్థానంలో, నారపనేని లక్ష్మీకీర్తి (990) రెండో స్థానంలో, కురుబ షిన్యత (990) మూడో స్థానంలో నిలిచారు.
ఎంఈసీలో మొదటి స్థానంలో నిషాంత్ కృష్ణ (992), రెండో స్థానంలో మీనా (981), మూడో స్థానంలో గుడివాడ నాగవెంకట అభిషేక్ (981) నిలిచారు.
సీఈసీలో కాదంబరి గీత (968) మొదటి స్థానంలో, అదులాపురం సెల్వరాజ్ ప్రియ (966) రెండో స్థానంలో, కాస శివరాం (964) మూడో స్థానంలో నిలిచారు.
హెచ్ఈసీలో గీత (966) మొదటి స్థానంలో, లావణ్య (952) రెండో స్థానంలో, సత్యనారాయణ (949) మూడో స్థానంలో నిలిచారు.