రూటుమార్చిన ఏపీ జేఏసీ అమరావతి ! ఎంపీలు, ఎమ్మెల్యేల ద్వారా జగన్ పై ఒత్తిడికి వ్యూహం ?
ఏపీలో ఉద్యోగుల సమస్యలపై రెండు దశల్లో ఉద్యమం పూర్తి చేసి మూడో దశలోకి అడుగుపెట్టిన ఏపీ జేఏసీ అమరావతి ఇక రూటు మార్చబోతోంది. ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించకపోవడంతో పాటు సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై గుర్రుగా ఉన్న ఉద్యోగ నేతలు.. ఈసారి ఉద్యమంలో విన్నూత పద్ధతి పాటించాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రజాప్రతినిధుల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచబోతున్నారు.
ఏపీలో ఉద్యోగ,ఉపాధ్యాయ,కార్మిక, రిటైర్డు, కాంట్రాక్టు & ఔట్ సోర్శింగు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని 57 రోజులుగా ఏపి జేఏసీ అమరావతి ఆద్వర్యంలో ఉద్యమం జరుగుతోంది. ఈనెల 8 నుండి మూడో దశ ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఈనెల 12 నుండి 19 లోపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 175 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీలను కలవాలని ఏపి జేఏసీ అమరావతి నిర్ణయించింది. జిల్లా కమిటీల ఆద్వర్యంలో వారిని కలిసి ఉద్యోగుల ఇబ్బందులు, ఆవేదనను, సమస్యలను అన్నింటిని కలిపి ఉద్యోగుల గుండెచప్పుడుగా వినిపించాలని నిర్ణయించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధుల్ని కలిసి తమ గోడును ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లి ఉద్యోగులపట్ల ప్రభుత్వం అవంబిస్తున్న తీరు మార్చుకొనేలా చూడాలని 175మంది ఎమ్మెల్యేలు, 25మంది పార్లమెంట్ సభ్యులకు వివరించబోతున్నారు. ఉద్యోగుల ఆవేదన చెబుదాం అనే కార్యక్రమం ద్వారా ఈ మేరకు విజ్ఞప్తి చేస్తామని ఏపిజెఏసి అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జెనరల్ పలిశెట్టి దామోదరరావు ప్రకటించారు.
ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు నేటికీ జీతాలు, పెన్షన్లు చెల్లించలేక పోవడం దేనికి సంకేతమని నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఎందుకు ప్రతి నెల ఇలా చేస్తుందని నిలదీశారు. రూపాయి కూడా పెన్షన్ ఈ రోజుకు ఏ ఉద్యోగికీ పడలేదన్నారు.వివిధ స్కీమ్ ల్లో పనిచేసే ఉద్యోగులకు, గురుకులాల్లో పనిచేసే ఉద్యోగులకు మూడు నుండి ఆరు మాసాలుగా జీతాలు లేవన్నారు. ప్రభుత్వం భాద్యతగా చెల్లించాల్సిన జీతాలు/పెన్షన్ సకాలంలో ఇవ్వలేని పరిస్దితులు వచ్చినా ఉద్యమం చేయకుండా ఎలా ఉండమంటారని అడిగారు. అందుకే ప్రతి ఒక్క ఉద్యోగి ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని కోరారు.












Click it and Unblock the Notifications