AP Polls: ఈసారి ఎన్నికల్లో గేమ్ ఛేంజర్ ఇదే ! అన్ని పార్టీలదీ అదే మాట..!
ఏపీలో ఎన్నికల పోలింగ్ కు మరో రెండు రోజులు మాత్రమే మిగిలుంది. రేపు సాయంత్రంతో ప్రచార పర్వం కూడా ముగియనుంది. ఈ తరుణంలో వచ్చే ఎన్నికల్ల ఓటరు నాడి ఎటుందని తెలుసుకునేందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్ధులు, సర్వేలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ఒక్క విషయంలో మాత్రం ప్రస్తుతం రాజకీయపార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చినట్లు కనిపిస్తున్నాయి. అయితే అది మ్యానిఫెస్టోనో, సంక్షేమమూ, అభివృద్ధో మాత్రం కాదు.
రాష్ట్రంలో ఈసారి ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకున్న క్రమంలో అనూహ్యంగా ల్యాండ్ టైట్లింగ్ చట్టం తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో భూములపై హక్కుల విషయంలో సందిగ్ధతకు తెరదించేందుకు ఇది పనికొస్తుందని ప్రభుత్వం దీన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదం కూడా పొందింది.అయితే అప్పట్లో వైసీపీ కానీ, ఇతర పార్టీలు కానీ దీన్ని సీరియస్ గా తీసుకోలేదు. కానీ విపక్షాలు రెండు వారాల క్రితం ఇందులో లా పాయింట్లను ఒక్కొక్కటిగా బయటికి తీయడం మొదలుపెట్టాయి. దీంతో వైసీపీ సహజంగానే ఆత్మరక్షణలో పడింది.

ముఖ్యంగా మీ భూముల ఆస్తి పత్రాలు ప్రభుత్వం వద్దే ఉంచుకని మీరు జిరాక్స్ కాపీలు ఇస్తారని, వాటిపైనా జగన్ ఫొటోయే ఉంటుందంటూ జనంలోకి విపక్షాలు తీసుకెళ్లిన ప్రచారం వారిలో ఆలోచన రేకెత్తించింది. అయితే ప్రభుత్వం డ్యామేనీ గ్రహించి స్పందించింది. ఈ చట్టం కేంద్రంలో బీజేపీయే తెచ్చిందని తొలుత చెప్పినా ఆ తర్వాత మాత్రం దీంతో మీ భూములు భద్రంగా ఉంటాయని జనానికి వివరించి చెప్పడం మొదలుపెట్టింది. ఈ వివరణతో జనం సంతృప్తి చెందారని వైసీపీ చెబుతోంది.
అయితే ఈసారి ఎన్నికల్లో మాత్రం భూహక్కు చట్టం ప్రభావం మాత్రం తీవ్రంగా ఉంటుందనే అంశాన్ని మాత్రం అధికార, విపక్షాలు అంగీకరిస్తున్నాయి. ముఖ్యంగా జనంలోకి విపక్షాలు దీన్ని తీసుకెళ్లిన తీరు వైసీపీకి పట్టున్న గ్రామీణ ప్రాంతాలల్లోని ప్రజల్లో ఆందోళన నింపినట్లు తెలుస్తోంది. అర్బన్ ప్రాంతాల్లో ప్రజలు మాత్రం దీంతో లాభనష్టాలను తెలుసుకుంటున్నారని, అంతిమంగా వారు ఏ నిర్ణయానికి వస్తే అటువైపే ఎన్నికలు మొగ్గవచ్చనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఇప్పటికే ఈ వివాదాస్పద చట్టానికి అనుకూలంగా, వ్యతిరేకంగా ఆయా పార్టీలు ప్రచారం నిర్వహిస్తున్నాయి.












Click it and Unblock the Notifications