పోలవరం: ఏపీ హర్షం, బాబు ప్రచారంతో నష్టమని బొత్స
మీ ప్రచారంతో రాష్ట్రానికి నష్టం: బొత్స
అధికార తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారం వల్ల రాష్ట్రానికి నష్టమని, వచ్చే పెట్టుబడులు రావని, పారిశ్రామికవేత్తల్లో ఆందోళన నెలకొంటుందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.
సోమవారం ఇందిరాభవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏ ప్రభుత్వమైనా రాష్ట్రం ఛిన్నాభిన్నమైందని చెప్పుకోదని, కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ కారణంగా రాష్ట్రం ఛిన్నాభిన్నమైందంటూ విమర్శిస్తున్నారని చెప్పారు.
ఇప్పటికీ రుణాల మాఫీపై స్పష్టత ఇవ్వడం లేదని, రైతులకు కొత్త రుణాలు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. బాబు విడుదల చేసిన శ్వేతపత్రాలపై తాము వాస్తవ పత్రాలను విడుదల చేస్తామని చెప్పారు. సభ్యులంతా హాలులోకి వచ్చాక.. కోరం లేదంటూ నెల్లూరు జడ్పీ చైర్మన్ ఎన్నికను వాయిదా వేయడమేమిటని ప్రశ్నించారు.