తెలంగాణలో వద్దు.. త్వరగా వెళ్లిపోదాం! బిజెపి ఆరాటం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో త్వరితగతిన రాజధానిని ఏర్పాటు చేసుకొని వెళ్లి పోవడమే మంచిదని ఆంధ్రప్రదేశ్ నాయకులు భావిస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అదే ఆలోచనతో ఉన్నారు. విభజన నేపథ్యంలో.. గుంటూరు - విజయవాడ మధ్య రాజధానిని ఏర్పాటు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. దీనిపై తుది నిర్ణయం తీసుకోక పోయినప్పటికీ.. అదే ఖరారు కానుందని అంటున్నారు. చంద్రబాబు, మంత్రుల వ్యాఖ్యలు చూసినా అది అర్థమవుతోంది.
మరోవైపు రాజధానిని ఖరారు చేసినందున దాని అభివృద్ధి పైన దృష్టి సారించాలని బీజేపీ నేతలు సూచిస్తున్నారు. రాజధాని గురించి ఓ నిర్ణయం తీసుకున్నాక.. ఇంకా అన్వేషణ పేరుతో జాప్యం చేయవద్దని బీజేపీ నేతలు చంద్రబాబుకు సూచిస్తున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ.. రాజధాని నిర్ణయం జరిగిపోయినందున ఇక.. అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. సాధ్యమైనం త్వరగా రాజధాని నిర్మాణం పూర్తి చేయాలని, అందుకు కేంద్రం సహకరిస్తుందని బీజీపీ చెబుతోంది.

బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఎల్లకాలం హైదరాబాదులోని కొనసాగించడం సాధ్యం కాదని, ఏపీ రాష్ట్రం త్వరితగతిన రాజధానిని నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. త్వరగా రాజధానిని నిర్మించి ఏపీ నుండి పాలించాలని బీజేపీ ఆరాటపడుతోంది. ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, అధికార తెలుగుదేశం పార్టీలు కూడా అదే అభిప్రాయంతో ఉన్నాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా రాజధాని నిర్మాణం పైన దృష్టి సారించారు. రాజధానిని త్వరగా నిర్మించుకొని వెళ్లడమే ఉత్తమమని ఆయన భావిస్తున్నారట. ఏపీ రాజధానిలో అసెంబ్లీ, ప్రభుత్వ కార్యాలయాలు, సచివాలయం తదితరాలు ఏర్పాటు చేయాలని, ఆ తర్వాతే 2019 ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు గట్టిగా భావిస్తున్నారట. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు రాజధాని నిర్మాణం కోసం నిధులను త్వరితగతిన ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నారు.












Click it and Unblock the Notifications