ప్రత్యేక హోదా కోసం నేడు బ్లాక్ డే...విజయవంతం కోసం విపక్షాల పిలుపు
విజయవాడ:ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనలో భాగంగా మంగళవారం చేపట్టనున్న బ్లాక్డేను విజయవంతం చేయాలని ప్రత్యేక హోదా సాధన సమితి, వామపక్షాలు,వైసిపి పిలుపునిచ్చాయి. ఈ మేరకు ఆయా పార్టీల నేతలు వేర్వేరు ప్రకటనల్లో రాష్ట్ర ప్రజలను కోరారు.
బ్లాక్ డే నిరసనలో భాగంగా సాయంత్రం 7 గంటల నుండి 7.30 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో లైట్లు ఆర్పేసి నిరసన వ్యక్తం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఎపికి ప్రత్యేక హోదాతో సహా విభజన హామీల సాధించేందుకు భవిష్యత్ కార్యాచరణ తాజా ప్రణాళికను అతి తర్వలో ప్రకటించనున్న్టట్లు ప్రత్యేక హోదా సాధన సమితి తెలిపింది.

మంగళవారం చేపట్టే బ్లాక్డేను విజయవంతం చేయాలని సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు పి.మధు, కె.రామకృష్ణ వేర్వేరు ప్రకటనల్లో విజ్ఞప్తి చేశారు. పార్లమెంటు సాక్షిగా చేసిన చట్టాలను, ఇచ్చిన హామీలను అమలు చేయాలని నాలుగేళ్ల నుంచి రాష్ట్రంలో నిరసనలు వెల్లువెత్తుతుంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికి నిధులు, విశాఖ రైల్వేజోన్, కడప స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు, కేంద్రీయ విద్యాసంస్థల ఏర్పాటుకు తగినన్ని నిధులు, రామాయపట్నం పోర్టు నిర్మాణం, పోలవరం జాతీయ ప్రాజెక్టును కేంద్ర నిధులతో పూర్తిచేయడం, రెవిన్యూ లోటు భర్తీ వంటి తదితర హామీలను నెరవేర్చకుండా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేసిందని వామపక్ష నేతలు పేర్కొన్నారు. మరోవైపు వైసీపీకి చెందిన నేతలందరూ ఈ బ్లాక్ డే లో పాల్గొనాలని అందరికీ ఆ పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లాయి. వైఎస్ జగన్ కూడా మంగళవారం తన శిబిరంలోనే బ్లాక్ డే ను పాటించనున్నట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications