ఏపీ శాసనమండలి రద్దు .. హస్తినలో పావులు కదుపుతున్న వైసీపీ .. పోటీగా ఢిల్లీ వెళ్లనున్న టీడీపీ
ఏపీలో శాసనమండలి రద్దు అంశం రాజకీయ వేడి పుట్టిస్తుంది. ఒకపక్క అసెంబ్లీలో శాసనమండలి రద్దు చేస్తూ తీర్మానం చేసి పార్లమెంట్ కి పంపిన వైసీపీ సర్కార్ త్వరిత గతిన ఆ పని పూర్తి కావాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. మరోపక్క మండలి రద్దును వ్యతిరేకిస్తున్న టీడీపీ సైతం అధికార పార్టీ ఎత్తులకు పై ఎత్తులు వేసే పనిలో ఉంది .

మండలి రద్దు కోసం ఢిల్లీ వేదికగా రాజకీయం
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును, సీఆర్డీఏ రద్దు బిల్లులను అధ్యయనం చేసి సరైన నిర్ణయం తీసుకోటానికి సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చెయ్యాలని నిర్ణయం చెయ్యటంతో మండలిని రద్దు చేస్తూ శాసన సభలో బిల్లు ఆమోదించింది వైసీపీ ప్రభుత్వం . ఇక మండలి రద్దు బిల్లు కేంద్రానికి పంపి ఆమోదం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందుకోసం సీఎం జగన్ స్వయంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మంత్రులతో, ముఖ్య నాయకులతో మాట్లాడుతూ పావులు కదుపుతున్నారు. రేపు సాయంత్రం అందులో భాగంగా అమిత్ షా ను కలిసి మండలి రద్దు బిల్లు ఆమోదించాలని కోరనున్నారు సీఎం జగన్, ఇక ఈ నేపధ్యంలో సీఎం జగన్ తీసుకున్న మండలి రద్దు నిర్ణయంపై టీడీపీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు .

రాజకీయ లబ్ది కోసమే మండలి రద్దు అంటూ టీడీపీ ఆగ్రహం
సీఎం జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ సర్కార్ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే మండలి రద్దు తీర్మానం చేశారని ఎమ్మెల్సీ అశోక్బాబు విమర్శించారు. దేశంలోని 10 రాష్ట్రాలు మండలి కావాలని అడుగుతున్నాయని పేర్కొన్న ఆయన ఆంధ్రప్రదేశ్లో మాత్రం రద్దుకు తీర్మానం చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు . సీఆర్డీఏను అడ్డుకున్నాం కాబట్టే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. మండలిని రద్దుచేయడం ప్రజా స్వామ్యంలో మంచిది కాదని అశోక్ బాబు పేర్కొన్నారు. మాతో కలిసి రావల్సిందిగా బీజేపీ, పీడీఎఫ్ ఎమ్మెల్సీలను కోరతామని ఆయన వ్యాఖ్యానించారు .

మండలి రద్దు చేస్తే ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతామన్న టీడీపీ
మండలి రద్దుపై ముందుకు వెళ్తే ప్రత్యక్ష ఆందోళనలకు తాము సిద్ధంగా ఉన్నామని టీడీపీ ఎమ్మెల్సీలు స్పష్టం చేశారు. మండలి రద్దుతీర్మానంచేసి సభ్యులను తీవ్రంగా అవమానించారని ఎమ్మెల్సీ బీటీ నాయుడు విమర్శించారు. అడ్డదారిన ఎమ్మెల్సీలు వచ్చారన్న సీఎం జగన్మోహన్రెడ్డివ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. మండలి సమావేశం జరిగితే సీఎం పై ప్రవిలేజ్ నోటీస్ ఇస్తామని ఆయన అన్నారు. సభా హక్కుల నోటీస్ ఇస్తామని తెలిపారు. టీచర్లు, లాయర్లు, డాక్టర్లు ఉన్న మండలిపై సీఎం జగన్ వ్యాఖ్యలు అభ్యంతరకరమని ఆయన పేర్కొన్నారు .

మండలి రద్దును వ్యతిరేకిస్తూ టీడీపీ ఎమ్మెల్సీలు ఢిల్లీ బాట
ఇక అంతేకాదు ఒకపక్క సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లి మరీ మండలి రద్దు కోసం ప్రయత్నాలు సాగిస్తున్న నేపధ్యంలో మండలి రద్దు తీర్మానంపై ఢిల్లీ వెళ్లే ఆలోచనలో టీడీపీ ఎమ్మెల్సీలు ఉన్నట్లు సమాచారం. మండలి రద్దు తీర్మానంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిని ఎమ్మెల్సీలు కలవనున్నారని తెలుస్తుంది . అలాగే రాష్ట్రపతిని కూడా కలవాలని టీడీపీ ఎమ్మెల్సీలు నిర్ణయించుకున్నట్లు సమాచారం . ఏది ఏమైనా మండలి లేకుండా చెయ్యాలని వైసీపీ, మండలి రద్దును ఆపాలని టీడీపీ ఎవరి వ్యూహాల్లో వాళ్ళు ఉన్నారు.












Click it and Unblock the Notifications