హైద్రాబాద్లో ఇబ్బంది పెడ్తున్నారు: కేంద్రానికి ఏపీ, కేటీఆర్ మాటే జగన్ నోట!
హైదరాబాద్: రేవంత్ రెడ్డి వ్యవహారం, చంద్రబాబు నాయుడిదిగా చెబుతున్న ఆడియో టేప్ వివాదం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. దీనిపై ఏపీ కేంద్రానికి ఫిర్యాదు చేయనుంది. ఉమ్మడి రాజధాని హైదరాబాదులో ఏపీ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని ఫిర్యాదు చేయనుంది.
మంగళవారం ఉదయం పదకొండు గంటలకు ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీలో రేవంత్ వ్యవహారం, ఆడియో టేపుల పైన కూడా చర్చించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం తీరును ఖండిస్తూ ఏపీ కేబినెట్లో తీర్మానం చేయనున్నారు.
హైదరాబాదు పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని అని, తమకు ఉమ్మడిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, తెలంగాణ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని, కేంద్రం జోక్యం చేసుకోవాలని ఏపీ కోరనుంది. అనంతరం సాయంత్రం చంద్రబాబు ఢిల్లీ పయనం కానున్నారు.
మరోవైపు, తెలంగాణ కేబినెట్ బుధవారం సాయంత్రం ఆరు గంటలకు భేటీ కానుంది. తెలంగాణ కేబినెట్లోను రేవంత్ రెడ్డి వ్యవహారం, చంద్రబాబు ఆడియో టేప్ పైన చర్చ సాగనుంది.

కేటీఆర్ మాటే జగన్ నోట!
చంద్రబాబు ఆడియో టేప్ పైన తెలంగాణలోని అధికార తెలంగాణ రాష్ట్ర సమితి, ఏపీలో ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒకే విధంగా మాట్లాడుతున్నాయి. చంద్రబాబు టేప్ వ్యవహారం వ్యక్తిగతమైనదని, దీనికి రెండు రాష్ట్రాల అంశంతో సంబంధం లేదని తెరాస చెబుతోంది.
చంద్రబాబు వ్యక్తిగత అంశమని, ఇది టీడీపీ వ్యవహారమని తెరాస నేతలు కేటీ రామారావు తదితరులు చెప్పారు. అయితే, దీనికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధం లేదని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే మాట చెబుతోంది. ఇది రెండు రాష్ట్రాల వ్యవహారం కాదని చెప్పింది. కేవలం చంద్రబాబు వ్యక్తిగతం అని చెబుతోంది.
కాగా, చంద్రబాబు అవినీతి రాజకీయాలకు నిరసనగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం నాడు ఏపీలో ప్రతి నియోజకవర్గంలో నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది.
సీబీఐ విచారణ జరిపించండి: కేసీఆర్కు వీహెచ్
చంద్రబాబు ఆడియో టేప్ వ్యవహారం పై సీబీఐతో విచారణ జరిపించాలని తాను చంద్రబాబుకు లేఖ రాశానని వీ హనుమంత రావు చెప్పారు. తమది నీతివంతమైన పాలన అని చెప్పే చంద్రబాబు ఇప్పుడు ఏం మాట్లాడుతారని వీహెచ్ ప్రశ్నించారు.
మీరు చేసిన తప్పు: తుమ్మల
ఏపీలో కేసులు అన్ని టీడీపీ కార్యాలయాల నుండే వెళ్తున్నాయని తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. చంద్రబాబు చేసిన తప్పుకు ఏపీ ప్రజలతో సంబంధమని ప్రశ్నించారు. బ్రోకర్ల ఫోన్ల నుంచి చంద్రబాబు ఎందుకు మాట్లాడారని ప్రశ్నించారు. బాబు వ్యవహారంతో మంత్రులంతా బాధపడుతున్నారన్నారు.
చంద్రబాబు ఫోన్ ఎవరు ట్యాప్ చేయలేదని, బ్రోకర్ చేసిన ఫోన్లో బాబు ఎలా మాట్లాడారని ప్రశ్నించారు. ఆ కాల్ మాత్రమే రికార్డు చేసినట్లు తెలిపారు. ఇకనైనా చంద్రబాబు తప్పు అంగీకరించాలన్నారు. ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని ఎందుకు చెప్పడం లేదన్నారు.












Click it and Unblock the Notifications