ఏపీలో చికెన్ షాపులకు బిగ్ షాక్.. కొత్త రూల్స్ !
ఆంధ్రప్రదేశ్లో చికెన్ దుకాణాల నిర్వహణ, విక్రయాలపై రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ (Andhra Pradesh Meat Development Corporation) కీలక నిర్ణయాలు తీసుకుంది. అక్రమ వ్యాపారాలు, నాణ్యత లేని మాంసం విక్రయాలు పెరుగుతున్న నేపథ్యంలో సంస్థ కొత్త లైసెన్సింగ్ విధానంను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ చర్యలు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా.. మాంసం రంగంలో పారదర్శకత, నాణ్యత, నైతికతకు చూపుతాయని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రజారోగ్య పరిరక్షణతో పాటు, వ్యాపారానికి శాస్త్రీయ పునాది వేయాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యంగా స్పష్టం చేస్తున్నారు.
కొత్త లైసెన్సింగ్ విధానం తప్పనిసరి..
కాగా ఇకపై ప్రతి చికెన్ షాపుకు ప్రత్యేక లైసెన్స్ తప్పనిసరి కానుంది. ఈ లైసెన్స్ ద్వారా పౌల్ట్రీ ఫారాల నుంచే పరిశీలన ప్రారంభం కానుంది. దుకాణాల యజమానులు ఎవరికి విక్రయిస్తున్నారు అనే వివరాలు డిజిటల్గా నమోదు చేయబడనున్నాయి. దీనినే "ఫామ్ టు షాప్ - ట్రాకింగ్ సిస్టమ్" అంటూ చెబుతున్నారు. ఈ మేరకు విజయవాడలోని పశు సంవర్ధకశాఖ డైరెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశానికి సంస్థ ఛైర్మన్ చంద్ర దండు ప్రకాశ్ నాయుడు అధ్యక్షత వహించారు. భేటీలో గతంలో జరిగిన మాంసం మాఫియా అక్రమాలపై విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయించారు.

"హెల్తీ ఆంధ్రప్రదేశ్"..
ఇక రాష్ట్ర ప్రభుత్వం "ఆరోగ్య ఆంధ్రప్రదేశ్" లక్ష్యంతో మాంసం వ్యాపారాన్ని క్రమబద్ధీకరించడంపై దృష్టి సారించింది. మున్సిపాలిటీలు, పంచాయతీల పరిధిలో ఉన్న అక్రమ చికెన్ షాపులపై ఆకస్మిక దాడులు చేయాలని కూడా ఆదేశించారు. సరైన అనుమతులు లేని షాపులను తక్షణమే మూసివేయాలని.. నాణ్యతా ప్రమాణాలు పాటించే దుకాణాలకే అనుమతులు ఇవ్వాలని స్పష్టం చేశారు. మరోవైపు హోటళ్ల యజమానులు, రెస్టారెంట్ల నిర్వాహకులు ఇకపై గుర్తింపు పొందిన చికెన్ షాపుల నుంచే మాంసం కొనుగోలు చేయాలని వెల్లడించారు. స్టెరాయిడ్లు లేదా హార్మోన్లు వాడిన కోళ్లు విక్రయించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగించే ఘటనలపై "పబ్లిక్ హెల్త్ ఆఫెన్స్" పేరుతో చర్యలు తీసుకొనున్నారు.
అలానే చికెన్ షాపుల్లో ఉత్పత్తయ్యే వ్యర్థాలను చేపలకు ఆహారంగా వాడుతున్న మాఫియాను అరికట్టాలని ఆదేశించారు. ఈ వ్యర్థాలను ప్రత్యేక బయో-హాజర్డ్ కంటైనర్లలో సేకరించి.. పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగా పారవేయడానికి పశుసంవర్ధకశాఖ కొత్త మార్గదర్శకాలు రూపొందిస్తోంది. ఇకపై కేరళ, తమిళనాడు, థాయ్లాండ్ వంటి ప్రాంతాలకు గోవుల అక్రమ తరలింపుపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ దిశగా ఇంటర్-స్టేట్ చెక్పోస్టుల వద్ద ప్రత్యేక పర్యవేక్షణ యూనిట్లు ఏర్పాటు కానున్నాయి.
మోడల్ మాంసం షాపులు..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పీ-4 విధానంలో భాగంగా ప్రతి మున్సిపాలిటీ, పంచాయతీలో మోడల్ మాంసం షాపులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మోడల్ దుకాణాలు అన్ని ..
శుభ్రత, సరైన కోల్డ్ స్టోరేజ్, నాణ్యమైన కటింగ్, ప్యాకేజింగ్ వ్యవస్థలతో ఉంటాయని అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగే పశు సంతలను (Animal Fairs) కూడా పర్యవేక్షించాలని నిర్ణయించారు. ఈ కొత్త చర్యలు అమల్లోకి వచ్చిన తర్వాత ప్రజలకు నాణ్యమైన చికెన్, మటన్ అందుబాటులోకి వస్తుందని.. వ్యాపారంలో అక్రమాలు తగ్గుతాయని "హెల్తీ ఆంధ్రప్రదేశ్" లక్ష్య సాధనకు కీలక ముందడుగు పడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications