లోకేష్, పవన్ ఇద్దరూ బఫూన్లే..తండ్రి సీఎం అయితే కొడుకూ కావాలా ? అంబటి ప్రశ్న
పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఇద్దరూ బఫూన్లేనని ఏపీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. సరకులేని పాదయాత్రలో ఏం ప్రయోజనమని ఆయన ప్రశ్నించారు.
టీడీపీ నేత నారా లోకేష్ యువగళం పేరుతో చేస్తున్న పాదయాత్ర.. కొంత దూరం పోయిన తర్వాత ప్రజలకు అర్ధం అవుతుందని ఏపీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. అది యువగళమా లేక యువ గరళమా అన్నది త్వరలోనే ప్రజలకు తెలుస్తుందన్నారు. లోకేష్ మాత్రమే కాకుండా, చంద్రబాబు కూడా ఆ గరళం తాగుతాడన్నారు. ఎందుకంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఏమవుతుంది? ఒళ్లంతా పుండవుతుంది. అదే లోకేష్కు కూడా జరుగుతుందన్నారు.
గొడ్డొచ్చిన వేళ, బిడ్డ వచ్చిన వేళ.. అన్న సామెత ఉందని, లోకేష్ రాజకీయాల్లోకి వచ్చాడు, తెలుగుదేశం పార్టీ 23 సీట్లకు పరిమితం అయిందని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ఇప్పుడు యువగళం పేరుతో యాత్ర మొదలు పెట్టాడు, గరళం తీసుకుని బయలుదేరాడు, ఏం జరుగుతుందో చూద్దామన్నారు. లోకేష్ ఒక బఫూన్, ఒక జోకర్. ఆయనకు పర్సనాలిటీ, క్యారెక్టర్ రెండూ లేవు. అయినా ఆయనను రాష్ట్రం మీద రుద్దాలని లోకేష్ తల్లిదండ్రులు తాపత్రయ పడుతున్నారన్నారు. అందుకే లోకేష్ ఎన్ని పాదయాత్రలు చేసినా, ఆయన నాయకుడు కాలేడన్నారు. ఎందుకంటే ఆయన దగ్గర సరుకు లేదు. నాయకుడు అనే వాడికి కొన్ని లక్షణాలు ఉండాలి. పట్టుదల, చిత్తశుద్ధి ఉండాలి. అవేవీ లోకేష్కు లేవని అంబటి విమర్శించారు. తన తండ్రి సీఎంగా పనిచేశారు కాబట్టి, తానూ సీఎం కావాలనుకుంటే ఎలా? అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఇద్దరు బఫూన్లు తయారయ్యారని, ఒకరు చంద్రబాబు పుత్రుడు, మరొకరు చంద్రబాబు దత్తపుత్రుడు పవన్కళ్యాణ్ అని అంబటి వ్యాఖ్యానించారు. ఒకాయన పాదయాత్రతో వచ్చినా.. మరొకరు వారాహి మీద వచ్చినా అంతా హాస్యమేనన్నారు. పవన్ నోటికి అడ్డూ అదుపు లేదని, ఆఖరికి తన తండ్రి గురించి ఏదేదో మాట్లాడతాడన్నారు. ఇక లోకేష్ తన తండ్రి కంటే గొప్పవాడినని చెప్పుకుంటున్నాడని, ఇద్దరి మాటలు అచ్చం జోకర్ల మాదిరిగా ఉన్నాయన్నారు. తన అర్హతలను ప్రశ్నిస్తున్నారని.. కానీ తాను మంత్రిగా ఎంతో సేవ చేశానని, రోడ్లు వేయించానని, చెట్టు నాటానని ఏదేదో లోకేష్ చెప్పాడని, మళ్లీ చెబుతున్నాం. లోకేష్కు ఏ అర్హతా లేదన్నారు.ఆయన ప్రత్యక్షంగా ఏ ఎన్నికలోనూ గెలవలేదన్నారు. కేవలం చంద్రబాబు కొడుకుగా ఎమ్మెల్సీ అయి, దొడ్డి దారిలో మంత్రి అయ్యాడన్నారు. కేవలం చంద్రబాబు తనయుడుగా తప్ప, లోకేష్కు ఒక్కటైనా అర్హత ఉందా? అని ప్రశ్నించారు. పాదయాత్ర చేస్తున్న లోకేష్కు చిత్తశుద్ధి లేదని, తానేదో పెరగాలనే తాపత్రయంతో ఆయన పాదయాత్ర చేపట్టాడన్నారు.

పాదయాత్రలు కొత్త కాదని, ఆనాడు మహానేత వైయస్సార్ గారు సుదీర్ఘ పాదయాత్ర చేసి చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత చాలా మంది పాదయాత్రలు చేశారని అంబటి గుర్తు చేశారు. మీ సీఎం అభ్యర్థి ఎవరు? నీవా? లేక నీ తండ్రినా? లేక పవన్కళ్యాణ్నా? అని అంబటి ప్రశ్నించారు. పవన్ తన పర్యటనల కోసం కొన్న వారాహి వాహనం గురించి కూడా లోకేష్ మాట్లాడారని, అంటే ఇప్పటికే ప్యాకేజీ కుదిరిందా?. ఇక పవన్ కూడా దారుణంగా మాట్లాడుతున్నాడన్నారు. తన నానమ్మ దేవుడి దగ్గర దీపం వెలిగిస్తే, దాంతో తన తండ్రి సిగరెట్ వెలిగించుకున్న హేతువాది అన్నాడన్నారు. ఆ విధంగా ఆయన తన తండ్రిని అవమానించాడని, అది నిజమో, అబద్ధమో చిరంజీవి లేదా నాగబాబు చెప్పాలన్నారు. ఏమిటా దుర్మార్గమైన మాటలని ప్రశ్నించారు. హేతువాదులైనంత మాత్రాన, మరొకరి విశ్వాసాలను, నమ్మకాలను దెబ్బతీసే హక్కు పవన్ కల్యాణ్ కు ఎక్కడిది..? అని అడిగారు.
రాష్ట్రంలో మూడున్నర ఏళ్లుగా చిత్తశుద్ధితో, పారదర్శకతతో అద్భుతమైన పరిపాలనను జగన్ అందిస్తున్నారని, అందుకే ఎంతమంది, కట్ట కట్టుకుని వచ్చినా, ఆయన ఎదుట నిలబడలేరన్నారు. ప్రతి పథకాన్ని అర్హతే ప్రామాణికంగా అమలు చేస్తున్నారని, అన్ని పథకాలు, కార్యక్రమాలు పూర్తి పారదర్శకంగా అమలు చేస్తున్నారు. జనం గుండెల్లో జగన్ గారు ఉన్నారన్నారు. మా ప్రయాణం ఎలాంటిది? మా పోరాటం ఎలాంటిది? ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నాం? మా నేతను అన్యాయంగా 16 నెలలు జైల్లో పెట్టినా, ఆయన భయపడలేదు. వెనక్కు తగ్గలేదు.
మా పార్టీ నుంచి 23 మందిని సంతల్లో పశువుల్లా కొనుగోలు చేసి, వారిలో నలుగురిని మంత్రులుగా కూడా చంద్రబాబు చేశారని అంబటి గుర్తుచేశారు. ఎవరు పాదయాత్ర చేసినా, మరొకరు వారాహి మీద వచ్చినా భయపడేది లేదన్నారు. ఎందుకంటే తాము ప్రజల్లో ఉన్నాం. వారి ఆదరాభిమానాలు పొందామన్నారు. పులి ఎవరో? నక్క ఎవరో? తెలుసు కదా?. పులి పోరాటం చేసి అధికారం చేపట్టింది. నక్క దాన్ని చూసి వాతలు పెట్టుకుంటుంది. ఒళ్లు పుండ్లు పడుతుంది తప్ప, మరేదీ ఒరగదన్నారు.












Click it and Unblock the Notifications