‘తెలంగాణ దేశం పార్టీ’: చంద్రబాబు, టీడీపీని ఏకిపారేసిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్
అమరావతి: టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కులాల మధ్య చిచ్చుపెట్టడమే చంద్రబాబు పని అని దుయ్యబట్టారు. సోమవారం మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడారు.
ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్న చంద్రబాబు..
అన్ని ప్రాంతాల అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ప్రకాశం జిల్లా టీడీపీ నేతలతో చంద్రబాబు లేఖ రాయించారని, రాయలసీమ లిఫ్టును ఆపేయాలంటూ టీడీపీ డిమాండ్ చేస్తోందని మండిపడ్డారు. కులాలు, మతాల మధ్య చిచ్చిపెట్టిన చంద్రబాబు.. ఇప్పుడు ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని ధ్వజమెత్తారు.
ఎమ్మెల్యేల లేఖ వెనుక చంద్రబాబు ప్రోద్బలం..
చంద్రబాబుది ఎప్పుడూ రెండు కళ్ల సిద్ధాంతమేనని మంత్రి అనిల్ ఎద్దేవా చేశారు. రాయలసీమ ప్రాజెక్టును ఆపేయాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేయడం ఆకోవలోకే వస్తుందన్నారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు సీఎం వైఎస్ జగన్కు లేఖ రాయడం వెనుక చంద్రబాబు ప్రోద్బలం ఉందని ఆరోపించారు.
టీడీపీ ఇక తెలంగాణ దేశం పార్టీ.. బాబుకు ఓటుకు నోటు కేసు భయం..
చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో భయపడుతున్నారని, అందుకే తెలంగాణ ప్రాజెక్టులపై నోరెత్తడం లేదని మంత్రి అనిల్ విమర్శించారు. తాజా పరిణామాలు పరిశీలిస్తే టీడీపీ 'తెలంగాణ దేశం పార్టీ'గా మారిపోయిందనే విషయం అర్థమవుతోందని అన్నారు. చంద్రబాబు హయాంలోనే తెలంగాణ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులను కట్టిందని గుర్తు చేశారు. తెలంగాణలో అన్ని పార్టీలు ఒకే మాటపైకి వస్తున్నాయన్న మంత్రి అనిల్ కుమార్.. ఏపీలో మాత్రం టీడీపీ ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతోందని మండిపడ్డారు.
చంద్రబాబుకు తెలుగు భాష గురించి మాట్లాడే హక్కు లేదు: యార్లగడ్డ
మరోవైపు చంద్రబాబు తీరుపై ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మండిపడ్డారు. తెలుగు భాష గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదని ఆయన అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు అకాడమీకి తెలుగు సంస్కృత అకాడమీగా పేరు మారిస్తే వచ్చే నష్టమేంటని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు తన హయాంలో తెలుగు అకాడమీ పేరు కూడా ఉచ్చరించలేదని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం వైఎస్ జగన్ అధికార భాషా సంఘానికి గుర్తింపు ఇచ్చారని కొనియాడారు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్.