ఏపీ మంత్రి అవంతికి కరోనా పాజిటివ్: ఆయన కుమారుడికి కూడా, ప్రజలకు సూచనలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే సామాన్య ప్రజలతోపాటు ప్రతిప్రతినిధులు కూడా కరోనా బారినపడిన విషయం తెలిసిందే. తాజాగా ఏపీ పర్యాటక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రావు (అవంతి శ్రీనివాస్) కరోనా బారినపడ్డారు.
మంత్రి అవంతి శ్రీనివాస్కు కరోనా సోకిందని ఆయన కార్యాలయం తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. అవంతితోపాటు ఆయన కుమారుడు వెంకట శివసాయి నందీష్కు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది.
ఈ క్రమంలో సందర్శకులు ఎవరూ కూడా తనను కలిసేందుకు కార్యాలయానికి రావొద్దని మంత్రి కోరారు. కార్యాలయ సిబ్బంది ఫోన్లో అందుబాటులో ఉంటారని, ఏ సమస్య వచ్చినా వారిని సంప్రదించాలని మంత్రి అవంతి శ్రీనివాస్ సూచించారు. కాగా, ఏపీలో ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కరోనా బారినపడిన విషయం తెలిసిందే.

ఏపీలో కరోనా స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు
ఏపీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. ఒక్క రోజులు రాష్ట్రంలో 61,529 నమూనాలను పరీక్షించగా.. 7956 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 5,75,079కి చేరింది. మరణాల సంఖ్య కూడా కొంత మేర తగ్గింది. గత 24 గంటల్లో 60 మంది మృతి చెందారు.
జిల్లాల వారీగా మృతుల వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో 9 మంది, అనంతపురంలో 7, కర్నూలులో 5, ప్రకాశం 5, విశాఖపట్నం 5, తూర్పుగోదావరి, కడప, కృష్ణ, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో నలుగురు చొప్పున, నెల్లూరులో ముగ్గురు, గుంటూరులో ఇద్దరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మరణించినవారి మొత్తం సంఖ్య 4972కు చేరింది.
Recommended Video
ప్రస్తుతం రాష్ట్రంలో 93,204 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 9764 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్త కేసుల కంటే కూడా రికవరీ అయిన వారి సంఖ్య ఎక్కువగా ఉండటం శుభపరిణామమనే చెప్పాలి. కాగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు 4,76,903 మంది కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 46,61,355 నమూనాలను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.












Click it and Unblock the Notifications