దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయ్-పవన్ కళ్యాణ్ కు మంత్రి బాలినేని సవాల్-టీడీపీపైనా విమర్శలు
ఏపీలో వైసీపీ వర్సెస్ జనసేనగా సాగుతున్న పోరు నానాటికీ తీవ్రమవుతోంది. వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పటికే దాదాపు ప్రతి రోజూ విమర్శలు చేస్తుండగా.. అధికార పార్టీ కూడా దీనికి కౌంటర్లు ఇస్తోంది. తాను మాట్లాడితే ఎలాగో మంత్రులు కౌంటర్లు ఇస్తారన్న వైసీపీ బలహీనతను గుర్తించిన పవన్ రోజూ చేస్తున్న విమర్శలతో ఇరు పక్షాల మధ్య వార్ ముదురుతోంది.
వైసీపీ ప్రభుత్వంపై నిత్యం విమర్శలు చేస్తున్న పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇవాళ తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ త్వరలో టీడీపీతో పొత్తు పెట్టుకుంటారన్న ప్రచారం నేపథ్యంలో స్పందించిన బాలినేని.. పవన్ కు సవాల్ విసిరారు. దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయాలని పవన్ కు బాలినేని సవాల్ విసిరారు. టీడీపీతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేసి గెలవాలని పవన్ ను కోరారు. పొత్తు లేకుండా పోటీ చేయలేరా అని ప్రశ్నించారు. అలాగే టీడీపీపైనా మంత్రి బాలినేని విమర్శలు గుప్పించారు.
పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదని మంత్రి బాలినేని సూచించారు. 38 ఏళ్ల చరిత్ర కలిగిన టీడీపీకి ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదన్నారు. ఎన్నికల్లో పొత్తు లేకుండా టీడీపీ ఎప్పుడైనా పోటీ చేసిందా అని బాలినేని శ్రీనివాసరెడ్డి సూటిగా ప్రశ్నించారు. తద్వారా ఈసారి జనసేన-టీడీపీ పొత్తు ఉంటుందనే అంశాన్ని బాలినేని కూడా పరోక్షంగా నిర్ధారించినట్లయింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ చేస్తున్న విమర్శల వెనుక టీడీపీ ఉందనే విషయాన్ని కూడా బాలినేని వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.
ఏపీలో ప్రస్తుతం బీజేపీతో పొత్తు కొనసాగిస్తున్న జనసేన.. త్వరలో ఆ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటోందన్న వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో టీడీపీ మాత్రం మౌనం వహిస్తోంది. తాజాగా చోటు చేసుకున్న ఆన్ లైన్ సినిమా టికెట్ల వివాదంలోనూ టీడీపీ మౌనం వహించింది. కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే విమర్శలు చేశారు. దీంతో మంత్రి బాలినేని టీడీపీతో కుమ్మక్కు కావడం వల్లే పవన్ ఈ వ్యాఖ్యలు చేశారనే అర్ధం వచ్చేలా ఇవాళ ఆయన్ను టార్గెట్ చేశారు.