చంద్రబాబు బాధ్యత మాదే-జైల్లో ఏం జరిగినా ? మంత్రి బొత్స హామీ...
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో సీఐడీ అరెస్టు చేసి జైలుకు పంపిన టీడీపీ అధినేత చంద్రబాబు భద్రతపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. రాజమండ్రి జైల్లో మావోయిస్టులు ఉన్నారని, అదే జైల్లో చంద్రబాబును పెట్టడం ఆయన భద్రత దృష్ట్యా సరికాదని టీడీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇదే అంశాన్ని జాతీయ స్ధాయికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో జైల్లో చంద్రబాబు భద్రతలపై ఏపీ మంత్రి బొత్స మరోసారి స్పందించారు.
రాజమండ్రి జైల్లో చంద్రబాబు భద్రతపై వ్యక్తమవుతున్న ఆందోళనపై స్పందించిన ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ.. ఆయనకు కల్పిస్తున్న భద్రతపై పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. ఇందులో ఏదైనా లోపం జరిగితే తాము పూర్తి బాధ్యత వహిస్తామన్నారు. ప్రభుత్వంపై టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపైనా బొత్స మండిపడ్డారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు ప్రమేయం లేదని నిరూపించుకోవాలని బొత్స సూచించారు.

చంద్రబాబు భద్రత విషయంలో ఎదురవుతున్న విమర్శలపై వైసీపీ ప్రభుత్వం తరఫున ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించారు. అలాగే జైలు తాజా ఇన్ ఛార్జ్ గా నియమించిన డీఐజీ రవికిరణ్ సైతం వివరణ ఇచ్చారు. అయినా టీడీపీ నేతల విమర్శల దాడి ఆగడం లేదు. ఈ నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ తాజా వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీని తర్వాత అయినా చంద్రబాబు భద్రతపై విమర్శల జడి వాన ఆగుతుందేమో చూడాలి మరి.
మరోవైపు పార్లమెంటులో కేంద్రం తెస్తున్న మహిళా బిల్లు విషయంపైనా మంత్రి బొత్స స్పందించారు. కేంద్రం ప్రతిపాదిస్తున్న మహిళా బిల్లుకు వైసీపీ అండగా నిలుస్తుందని బొత్స వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలో వైసీపీ సర్కార్ మహిళలకు స్ధానిక సంస్ధల్లో 50 శాతం సీట్లు కేటాయించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.












Click it and Unblock the Notifications