సీపీఎస్ పై రెండునెలల్లో నిర్ణయం-ఛలో విజయవాడ నేపథ్యంలో బొత్స కీలక ప్రకటన..
ఏపీలో సీపీఎస్ రద్దు కోసం ఉద్యోగులు ఉద్యమిస్తున్నారు. ఈ నెల 11న సీపీఎస్ రద్దుపై ఛలో విజయవాడకు సైతం పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పోలీసుల సాయంతో ఉద్యోగుల్ని అరెస్టు చేయడం, బైండోవర్ కేసులు నమోదు చేస్తోంది. దీంతో ఉద్యోగులు కూడా ప్రభుత్వ తీరుపై భగ్గుమంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
ఏపీలో సీపీఎస్ రద్దుపై ఉద్యమిస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం ఇవాళ మరో సందేశం పంపింది. సీపీఎస్ రద్దుపై రెండు నెలల్లో నిర్ణయం తీసుకుంటామని విద్యామంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన ప్రకటన చేశారు. అలాగే ప్రభుత్వ నిర్ణయం ఉద్యోగులకు ఆమోదయోగ్యంగా ఉంటుందన్నారు. తద్వారా రేపు ఛలో విజయవాడకు సిద్ధమవుతున్న ఉద్యోగుల్ని గందరదోళంలోకి నెట్టారు. దీంతో ఉద్యోగులు ఛలో విజయవాడ నిర్వహించాలా వద్దా అనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది.
ఇవాళ మీడియా సమావేశంలో విద్యామంత్రి బొత్స సత్యనారాయణ సీపీఎస్ రద్దు హామీపై పాతపాడే పాడారు. సీపీఎస్ రద్దు అనేది తమ ప్రభుత్వం గతంలో ఇచ్చిన 100 హామీల్లో ఒకటని, ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. సీపీఎస్ రద్దుపై రెండు నెలల్లో నిర్ణయం ప్రకటిస్తామని, అలాగే ఉద్యోగుల క్రమబద్ధీకరణపై ఈ ఏడాది ఆఖరు నాటికి నిర్ణయం ఉంటుందన్నారు. దీంతో బొత్స ప్రకటనపై ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.