అమరావతి తీర్పును తప్పుబట్టిన బుగ్గన-అసెంబ్లీయే సుప్రీం అని ప్రకటన-3 రాజధానులకు సమర్ధన
ఏపీలో అమరావతి రాజధాని కొనసాగింపు విషయంలో హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పుపై ఇవాళ అసెంబ్లీలో కీలక చర్చ జరిగింది. ఇందులో పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడారు. ఇదే క్రమంలో ఆర్ధిక, అసెంబ్లీ వ్యవహారాలశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కూడా చివర్లో మాట్లాడారు. ఇందులో ఆయన మూడు రాజధానుల్ని సమర్ధిస్తూనే అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును పరోక్షంగా తప్పుబట్టారు.
ఏపీలో ప్రాంతీయ అసమానతలు తొలగించేందుకే వైసీపీ సర్కార్ మూడు రాజధానుల్ని తెరపైకి తెచ్చిందని బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. ఇందుకు దారి తీసిన పలు కారణాల్ని ఆయన మరోసారి అసెంబ్లీలో ప్రస్తావించారు. శ్రీబాగ్ ఒప్పందంతో పాటు గతంలో ఏపీ చరిత్రలో చోటు చేసుకున్న పలు అంశాల్ని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో సమానత్వం నెలకొల్పే బాధ్యత ప్రభుత్వానికి ఉందని ఆర్ధికమంత్రి తెలిపారు. శ్రీబాగ్ ఒప్పందంలోనే రాయలసీమకు నీళ్లివ్వాలని, విశాఖలో ఉన్న యూనివర్శిటీకి అనంతపురంలో బ్రాంచి పెట్టాలని చెప్పారని మంత్రి తెలిపారు. అప్పట్లో పెద్దల ఒప్పందాన్ని ఏపీ, తెలంగాణ ఎందుకు చేసుకున్నాయో కూడా గమనించాలన్నారు.
చరిత్రలో అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రాంతీయ మండళ్లను కూడా పెద్దలు ప్రతిపాదించారని ఆర్ధికమంత్రి గుర్తుచేశారు. 1910 నుంచీ ఏపీలో చోటు చేసుకున్న పలు పరిణామాల ఆధారంగా ప్రభుత్వం వికేంద్రీకరణ నిర్ణయం తీసుకుందని బుగ్గన తెలిపారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక తర్వాత ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వం వికేంద్రీకరణకు బదులుగా అమరావతిలో కేంద్రీకరణకే మొగ్గు చూపిందని బుగ్గన గుర్తుచేశారు.అందుకే తాము మూడురాజధానుల నిర్ణయం తీసుకున్నామన్నారు.
మరోవైపు మూడు రాజధానుల స్ధానంలో అమరావతే ఉండాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై బుగ్గన కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ తీసుకునే నిర్ణయానికి హైకోర్టు అప్పిలేట్ అథారిటీ కాదన్నారు, అలాగే పాలనాపరమైన అంశాల్లో చట్ట సభలకు సూచనలిచ్చే బాధ్యత కూడా కోర్టులది కాదని బుగ్గన తెలిపారు. దీనికి సంబంధించి గతంలో పలు కోర్టులు ఇచ్చిన తీర్పుల్ని సైతం అసెంబ్లీలో బుగ్గన ప్రస్తావించారు. తద్వారా ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించి అసెంబ్లీయే సుప్రీం అని ఆయన తేల్చిచెప్పారు.