పవన్ గుండుతోనే చిరుకు అవమానం-నిన్నూ-బాబును అమిత్ షా కలవలేదేం ? దాడిశెట్టి రాజా ఫైర్
ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాల్ని ఏకం చేస్తానంటూ పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలకు మంత్రులు గట్టిగా కౌంటర్లు ఇస్తున్నారు. ఇదే క్రమంలో ఇవాళ మంత్రి దాడిశెట్టి రాజా పవన్ పై ఫైర్ అయ్యారు. 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో పోటీ చేసే దమ్ముందా పవన్ కల్యాణ్..? అని ఆయన ప్రశ్నించారు. బాబు-పవన్ విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. నీ ఎదుగుదలకు కారణమైన చిరంజీవి తమ్ముడినని ఏనాడైనా చెప్పావా పవన్..? అని ప్రశ్నించారు. చిరంజీవి-జగన్ సొంత అన్నదమ్ముల్లా ఉంటారని, పవన్ - బాబులను అమిత్ షా కలవలేదంటేనే.. వీళ్ళ స్థాయి ఏంటో తెలుసుకోవాలన్నారు.
జగన్ ను టచ్ చేయలేరన్న దాడిశెట్టి రాజా
వైసీపీకి ప్రజల నుంచి వస్తున్న స్పందన చూశాక, ప్రజా ప్రతినిధులుగా తమకు మరింత ప్రోత్సహకంగా, చాలా సంతోషంగా ఉందని మంత్రి దాడిశెట్టి రాజా తెలిపారు. రూపాయి అవినీతి లేకుండా, రాష్ట్రంలో అర్హులైన లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, ప్రజల నుంచి వచ్చే ఈ స్పందన చూసి ఓర్చుకోలేని, తట్టుకోలేని ప్రతిపక్షాలు, ప్రభుత్వంపై రకరకాల కుట్రలు చేస్తున్నాయన్నారు. సీఎం జగన్ ప్రతిష్టను దిగజార్చేందుకు ఒకవైపు ఎల్లో మీడియా, మరోవైపు చంద్రబాబు అండ్ కో నిత్యం ఏదోరకంగా బురదచల్లుతూనే ఉన్నాయన్నారు.
గతంలో ఎన్టీఆర్ ను తొలిసారి నాదెండ్ల భాస్కర్రావు వెన్నుపోటు పొడిచాడని, అప్పటికీ ఎన్టీఆర్ జాగ్రత్తగా ఉండకపోవడంతో రెండోసారి చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడన్నారు. ఇప్పుడు, "నారా-నాదెండ్ల" కుమ్మక్కై పవన్ కల్యాణ్ అనే శిఖండిని కలుపుకుని, జననేత అయిన జగన్గారిని ఏదో రకంగా వెన్నుపోటు పొడుద్దామనే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
మీ ముగ్గురు కాదు కదా, మీలాంటి వాళ్లు మూడు వందల మంది వచ్చినా వైఎస్ జగనన్న ప్రజా బలం ముందు ఆయన్ను మీరు కనీసం టచ్ చేయను కూడా చేయలేరని దాడిశెట్టి రాజా తెలిపారు.
చిరు-జగన్ అన్నదమ్ములు
చిరంజీవిని జగన్ ఏదో అవమానించారని పవన్ కల్యాణ్ అబద్ధాలు మాట్లాడుతున్నాడని మంత్రి దాడిశెట్టి ఆక్షేపించారు. చిరంజీవి -జగన్ ఎంత ఆప్యాయంగా ఉంటారో తానే ప్రత్యక్ష సాక్ష్యమన్నారు. గతంలో అయన ఇంటికి వచ్చినప్పుడు అయినా, ఇటీవల భీమవరం కార్యక్రమంలో అయినా వారిద్దరూ ఎంతో ఆప్యాయంగా సొంత అన్నదమ్ముల్లా ఉంటారనేది దగ్గరుండి చూశానన్నారు. ఎప్పుడూ పవన్ కల్యాణ్, తాను కానిస్టేబుల్ కొడుకునని చెప్పుకుంటాడు తప్పితే, అతను ఈ స్థాయికి రావడానికి కారణమైన చిరంజీవి సోదరుడిని అని ఎప్పుడూ చెప్పుకున్నట్లు కనిపించలేదన్నారు.
పవన్ వల్లే చిరుకు అవమానం
రాజకీయాల్లోగానీ, సినిమాల్లో గానీ చిరంజీవి ఎప్పుడూ అవమానపడలేదని, అవమానం అంటూ జరిగితే అది పవన్ కల్యాణ్ వల్లే జరిగిందని మంత్రి దాడిశెట్టి రాజా తెలిపారు. పరిటాల రవి నీకు గుండు కొట్టించినప్పుడు, చిరంజీవి చంద్రబాబును కలవడానికి వస్తే, అధికార మదంతో ఆరోజు చంద్రబాబు-పరిటాల రవి లు కలిసి చేసిన అవమానమే చిరంజీవి జీవితంలో పెద్ద అవమానమన్నారు.
నీ గుండు ఎపిసోడ్లో మాత్రమే చిరంజీవిగారికి అవమానం జరిగిందన్నారు. మెగాస్టార్ గా తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన చిరంజీవిని ఎవరూ అవమానించలేదన్నారు. తాజాగా ఆయన పుట్టినరోజున మళ్లీ పవన్ కల్యాణే అలాంటి మాటలు మాట్లాడి ఆయన్ను అవమనించారన్నారు.
పవన్ కు మరో సవాల్
పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాల్లో 175కు, 25 పార్లమెంట్ స్థానాల్లో 25కు పోటీ చేసే దమ్ము ఉందా..? అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సూటిగా ప్రశ్నిస్తోందని మంత్రి దాడిశెట్టి రాజా సవాల్ విసిరారు. నీకు ఆ దమ్ములేదని, చంద్రబాబు చెబితే తప్ప, జనసేన పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందో చెప్పలేని పరిస్థితి పవన్ కల్యాణ్ది అని మంత్రి అన్నారు. అలాంటి నువ్వు మాపై విమర్శలు చేయడంలో అర్థంలేదన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు పవన్ కల్యాణ్- చంద్రబాబు విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలని కోరుకుంటున్నారన్నారు. ఎందుకంటే మీ ఎజెండా ఏమిటో ప్రజలకు అర్థం అయింది కాబట్టి అన్నారు.
పవన్-బాబును అమిత్ షా ఎందుకు కలవలేదని ప్రశ్న
నువ్వు పెద్ద పుడింగి అని ఫీల్ అయిపోతుంటావు కదా? నిన్నగాక మొన్న అమిత్ షా హైదరాబాద్ వచ్చారని, మరి నువ్వు పెద్ద పుడింగివే అయితే, ఆయన నీ దగ్గరకు వచ్చి కలిసేవాళ్లు కదా? అని పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి దాడిశెట్టి రాజా ప్రశ్నించారు. కానీ జూనియర్ ఎన్టీఆర్తో భేటీ అయి వెళ్ళారని, అలానే అమిత్షా రామోజీ ఫిల్మ్సిటీకి వస్తారని, రామోజీరావుతో పాటు చంద్రబాబుతో భేటీ అవుతారని ఎల్లో మీడియాలో వారం రోజులపాటు రకరకాలుగా వార్తలు ప్రచారం చేసుకున్నారని, అమిత్ షా రామోజీ ఫ్మిల్సిటీకి అయితే వచ్చారు కానీ, మరి చంద్రబాబు నాయుడు ఎక్కడా కనిపించలేదేం..? అని నిలదీశారు. అలాగే రంగా హత్యతో బాబుకు సంబంధం లేదని చెప్పించగలవా అని పవన్ ను దాడిశెట్టి ప్రశ్నించారు.