వైసీపీ క్యాడర్ లో నిరుత్సాహం-కారణాలివే-జగన్ మంత్రి దాడిశెట్టి రాజా వ్యాఖ్యలు
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తవుతోంది. మరో రెండేళ్లలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ లోపే ముందస్తు ఎన్నికలు ఉండొచ్చన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీలో జోష్ నింపేందుకు సీఎం జగన్ జిల్లాలు, నియోజకవర్గాల వారీగా ప్లీనరీలు నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొంటున్న మంత్రులు, మాజీ మంత్రులు, పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. ఇదే క్రమంలో తాజాగా తుని ఎమ్మెల్యే, రవాణా మంత్రి దాడిశెట్టి రాజా వైసీపీ క్యాడర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
దాడిశెట్టి రాజా కామెంట్స్
ఏపీలో వైసీపీ సర్కార్ మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ కార్యకర్తల్లో నిరుత్సాహం నెలకొంది. దీనికి గత ప్రభుత్వానికీ, ప్రస్తుత ప్రభుత్వానికీ మధ్య తేడాయే కారణం. ఈ మాట అన్నది ఎవరో కాదు సాక్ష్యాత్తు ఏపీ రవాణాశాఖ మంత్రి దాడిశెట్టి రాజా. తునిలో జరిగిన వైసీపీ ప్లీనరీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీని వెనుక ఉన్న కారణాల్ని కూడా రాజా వెల్లడించారు. దీంతో ఇప్పుడు దాడిశెట్టి రాజా వ్యాఖ్యలు వైసీపీతో పాటు విపక్షాల్లోనూ చర్చనీయాంశం అవుతున్నాయి.
వైసీపీ క్యాడర్ లో నిరుత్సాహం
తుని వైసీపీ ఫ్లీనరీలో మంత్రి రాజా ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ క్యాడర్ లో నిరుత్సాహం ఆవరించిందన్నారు. దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయన్నారు. వైసీపీ క్యాడర్ లో నెలకొన్న నిరుత్సాహాన్ని పారద్రోలే లక్ష్యంతోనే ప్లీనరీలు నిర్వహిస్తున్నట్లు కూడా ఆయన తెలిపారు. అందుకే ఈ నిరుత్సాహం వెనుక ఉన్న కారణాల్ని ఆయన వెల్లడించారు. దీంతో ప్లీనరీలో పాల్గొన్న వైసీపీ నేతలు, కార్యకర్తలు రాజా వ్యాఖ్యలపై ఇప్పుడు చర్చించుకుంటున్నారు.
వైసీపీలో నిరుత్సాహానికి కారణాలివే!
గత టీడీపీ హయాంలో ముఖ్యమంత్రి స్థాయి నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు అందరు సంపాదించుకున్నారని మంత్రి దాడిశెట్టి రాజా తెలిపారు. అలాంటి భావనే మన కార్యకర్తల్లో కూడా కొంతమందికి ఉండేదని పేర్కొన్నారు. అయితే ముఖ్యమంత్రి జగన్ పారదర్శకమైన పరిపాలన అందించడంతో అది కుదరలేదని వ్యాఖ్యానించారు.
దీంతో కార్యకర్తలు, నాయకులు కొంత నిరుత్సాహానికి గురి అయ్యారని అది వాస్తవమని మంత్రి అన్నారు. నేను కూడా మీలానే నిరుత్సాహానికి గురి అయ్యానంటూ కార్యకర్తలకి చెప్పుకొచ్చారు. టీడీపీ హయాంలో ఏ పధకం అమలు కావాలన్నా జన్మభూమి కమిటీ మెంబెరే అమలు చేసేవారని గుర్తు చేసారు. అందుకే వారు బాత్రూముల పధకంతో పాటు మిగిలిన పథకాల్లో కూడా అవినీతికి పాల్పడ్డారని అన్నారు.