మంత్రి మాణిక్యాలరావు సంభాషణ రికార్డ్: వ్యక్తి అరెస్ట్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు సంభాషణను భారతీయ జనతా పార్టీకి చెందిన ఓ కార్యకర్త ఫోన్లో రికార్డ్ చేశారు. ఇది గమనించిన మంత్రి భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు.
ఫోన్ ట్యాపింగ్, సంభాషణల రికార్డింగ్ వివాదాస్పదమవుతున్న తరుణంలోనే తన సంభాషణ రికార్డు కావడంతో మంత్రి ఆశ్చర్యానికి గురయ్యారు. సచివాలయంలోని మంత్రి ఛాంబర్లో గురువారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.
శ్రీశైలం దేవస్థానం పాలక మండలిలో పార్టీ నేత ఒకరికి అవకాశం కల్పించే విషయంపై కర్నూలు జిల్లా బిజెపి అధ్యక్షుడు, నేతలు, కార్యకర్తలు హైదరాబాద్కు వచ్చి మంత్రిని కలిశారు.
కాగా, నామినేటెడ్ పోస్టుల అంశంపై మంత్రి మాట్లాడిన మాటల్ని, ఆ తర్వాత ఇదే విషయంపై పార్టీలో ఓ ముఖ్యనేతతో మాణిక్యాలరావు జరిపిన ఫోన్ సంభాషణల్ని సదరు కార్యకర్త తన ఫోన్లో రికార్డ్ చేశారు.
ఈ విషయాన్ని గుర్తించిన మంత్రి వ్యక్తిగత కార్యదర్శి మాణిక్యాలరావుకు తెలిపారు. దీంతో అప్రమత్తమైన భద్రత సిబ్బంది ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత రికార్డు అయిన సంభాషణను ఫోన్ నుంచి తొలగించి, అతడ్ని పంపించివేశారు.