చంద్రబాబు ఆదేశాలు పాటించే వ్యక్తే నిమ్మగడ్డ: ఏకిపారేసిన కొడాలి నాని
అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్పై మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. ఈ అంశంపై సీఎస్, ఆరోగ్య శాఖ కార్యదర్శి, అధికారులు వెళ్లి చెప్పినా పట్టించుకోలేదన్నారు.

నిమ్మగడ్డ మూతిపళ్లు రాలేలా హైకోర్టు తీర్పు
ప్రజలు ఏమైపోయినా తన పదవి అయిపోయే లోపు ఎన్నికలు నిర్వహించాలని నిమ్మగడ్డ రమేష్ చూశారని నాని మండిపడ్డారు. ఇప్పుడు హైకోర్టు తీర్పు 'కుక్క కాటుకు చెప్పు దెబ్బ'లా.. నిమ్మగడ్డ మూతిపళ్లు రాలేలా తీర్పు వచ్చిందని మంత్రి కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కరోనా ప్రబలి ప్రజలు చనిపోయి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని నిమ్మగడ్డ చూశారని ఆరోపించారు.

చంద్రబాబు ఆదేశాలు పాటించే వ్యక్తి నిమ్మగడ్డ రమేష్
చంద్రబాబు ఆదేశాలు అమలు చేసిన వ్యక్తి నిమ్మగడ్డ అని, రాజ్యాంగ పదవిలో ఉండి ఆ పదవికి చేటు తెచ్చిన వ్యక్తి నిమ్మగడ్డ అని కొడాలి నాని దుయ్యబట్టారు. ఇప్పటికైనా నైతిక బాధ్యతతో నిమ్మగడ్డ రాజీనామా చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుతో వ్యాక్సినేషన్ కార్యక్రమంతో ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని ప్రభుత్వం చూస్తోందని, త్వరలోనే కోవిడ్ వారియర్స్కు వ్యాక్సిన్ ఇస్తామని మంత్రి నాని స్పష్టం చేశారు.

వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కుట్రలతో ఎదుర్కోలేరు..
ఇది ఇలావుంటే, మరో వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ కూడా నిమ్మగడ్డ రమేష్పై మండిపడ్డారు. ఎన్నికల షెడ్యూల్ను హైకోర్టు సస్పెండ్ చేయడం ప్రజా విజయమని అన్నారు. ఇది నియంతృత్వ పోకడలకు పోయే రాజ్యాంగేతర శక్తులకు చెంపపెట్టులాంటిదని అన్నారు. ప్రజా విశ్వాసం పొందిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కుట్రలతో ఎదుర్కోవాలనుకోవడం మూర్ఖత్వమని వ్యాఖ్యానించారు. ఏపీ హైకోర్టు తీర్పు చారిత్రాత్మకమని, ఎన్నికల కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యమని హైకోర్టు స్పష్టం చేసిందని తెలిపారు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని ఎంపీ తలారి రంగయ్య తెలిపారు. ఇప్పటికైనా నిమ్మగడ్డ రమేష్ రాజ్యంగ బద్ధంగా వ్యవహరించాలని హితవు పలికారు.


Click it and Unblock the Notifications