తమిళనాడు ఉపఎన్నికల్లో విజయ్ కు మిత్రపక్షాల షాక్...! కూటమిపైనే పోటీ..!
తమిళనాడులో ఈ ఏడాది ఎన్నికల తర్వాత కొత్త మిత్రపక్షాలతో కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన జోసెఫ్ విజయ్ (Joseph Vijay)కు ఎప్పటికప్పుడు షాకులు తగులుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కూటమిలో భాగస్వాములుగా ఉన్న పార్టీలు.. పైకి మద్దతిస్తూనే లోలోపల గోతులు తవ్వుతున్నాయి. దీంతో మిత్రపక్షాల వైఖరిపై విజయ్ అసంతృప్తిగానే ఉన్నారు. అయితే ఇప్పుడు వీరిలో కొందరు సమయం చూసి నేరుగా విజయ్ కు షాకిచ్చారు.
విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి బయట నుంచి మద్దతు ఇస్తున్న సీపీఐ, సీపీఎం... త్వరలో రాష్ట్రంలో జరగబోతున్న ఉప ఎన్నికల్లో (Tamil Nadu Bypolls) పోటీ చేయాలని నిర్ణయించాయి. తాము మద్దతిస్తున్న ప్రభుత్వానికి చెందిన అభ్యర్థులకు వ్యతిరేకంగా ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని లెఫ్ట్ పార్టీలు నిర్ణయించుకున్నాయి. అక్టోబర్ 6న జరిగే మదురాంతకం, ధారాపురం అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఈ మేరకు వామపక్షాలు స్వతంత్రంగా బరిలోకి దిగనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న టీవీకే, డీఎంకే, అన్నాడీఎంకే-బీజేపీ కూటముల్లో తాము భాగస్వాములు కాదని, అందుకే ఉప ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయాల్సి వస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.షణ్ముగం తెలిపారు.

మరోవైపు లెఫ్ట్ (Left) పార్టీల నిర్ణయంపై అంతర్గతంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీవీకే ప్రభుత్వానికి బయట నుంచి మద్దతు ఇస్తూనే, ఆ పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు ఎన్నికల్లో పోటీ చేయడం సాధారణ ఓటరుకు ఎలా అర్థమవుతుందనే ప్రశ్నల్ని పార్టీల్లో కొందరు నేతలు లేవనెత్తుతున్నారు. మదురాంతకం, ధారాపురం నియోజకవర్గాల నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో అన్నాడీఎంకే తరఫున గెలిచి, ఆ తర్వాత రాజీనామాలు చేసి టీవీకేలో చేరిన కె.మరగతం కుమారవేల్, పి.సత్యబామలు బరిలోకి దిగుతున్నారు. సీఎం విజయ్ ఈ రెండు నియోజకవర్గాల్లోనూ కనీసం ఒక్కరోజు చొప్పున ప్రచారం చేయనున్నారు. అలాంటి చోట వామపక్షాల ప్రవేశంతో ఈ రెండు సీట్లలో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. టీవీకే, డీఎంకే, అన్నాడీఎంకే-బీజేపీ కూటమి, వామపక్షాలు, నామ్ తమిళర్ కచ్చి మధ్య ఐదు కోణాల్లో ఈ పోటీ జరగబోతోంది.














Click it and Unblock the Notifications
