ఐదుగుర్ని ప్రధానులు చేసింది బాబే: బీజేపీ, వైసీపీపై లోకేష్ ఫైర్, ‘స్కోచ్ అవార్డుకు ఎంపిక’
ప్రకాశం: కేంద్రం, భారతీయ జనతా పార్టీపై ఏపీ పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలుగుజాతితో బీజేపీ వైరం పెట్టుకుందని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని అన్నారు. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికలు కేవలం ట్రయలర్ మాత్రమేనని, అసలు సినిమా 2019లో ఉంటుందని అన్నారు.
ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వేటపాలెం మండలం కొత్తపేట పంచాయతీపరిధిలో ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. తెలుగుజాతితో పెట్టుకున్న బీజేపీకి పుట్టగతులుండవన్నారు.

బాబు 29సార్లు తిరిగినా..
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మాటలతో మభ్యపెట్టి కాలయాపన చేశారని లోకేష్ మండిపడ్డారు. చంద్రబాబును 29 సార్లు ఢిల్లీకి తిప్పారని, అయినా ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ మోడీ ప్రభుత్వం అమలుచేయలేదన్నారు. రాష్ట్రంలో 25 ఎంపీ సీట్లు గెలిపించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చేందుకు సీఎం చంద్రబాబును ఆశీర్వదించాలని లోకేష్ కోరారు.

2015 నుంచి వైసీపీ డ్రామాలు
వైయస్సార్ కాంగ్రెస్ ఎంపీలు 2015లోనే రాజీనామా చేస్తామని చెప్పారని, అదే విషయాన్ని 2016, 2017ల్లో కూడా చెప్పారని.. ఇప్పుడు ఉప ఎన్నికలు రావని తేలాకే రాజీనామా పత్రాలు ఇచ్చి డ్రామా ఆడుతున్నారని లోకేష్ మండిపడ్డారు. ‘వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి.. మోడీకి వ్యతిరేకంగా మాట్లాడరు. ప్రత్యేక హోదా కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న సీఎంకు వ్యతిరేకంగా మాట్లాడతారు' అని లోకేష్ ధ్వజమెత్తారు.

ఐదుగురు ప్రధానులను చేసిన చంద్రబాబు
వాజపేయి, దేవెగౌడ, ఐకే గుజ్రాల్ తోపాటు ఐదుగురిని దేశానికి ప్రధానులను చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కిందని లోకేష్ అన్నారు. అంతేగాక, 2019లో ప్రధాని పీఠం ఎవరు ఎక్కాలో చంద్రబాబే నిర్ణయిస్తారని లోకేష్ చెప్పారు. కేంద్రం అన్ని విషయాల్లో మోసం చేసినా బీజేపీ పాలిత రాష్ట్రం గుజరాత్ కంటే అభివృద్ధిలో ఏపీ ముందంజలో ఉందన్నారు లోకేష్.

స్కోచ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా లోకేశ్
మంత్రి నారా లోకేష్.. స్కోచ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్-గవర్నెన్స్ అవార్డుకు ఎంపికయ్యారు. జూన్ 23న ఢిల్లీలో ఆయన ఈ పురస్కారం అందుకుంటారు. గ్రామీణ తాగునీటి సరఫరాలో ట్రాకింగ్ విధానం లోకేష్ ప్రవేశపెట్టారు. తాగునీటిని ట్యాంకర్లో నింపే దగ్గరి నుంచి.. ప్రజలకు ఇచ్చే దశ వరకు ఫోటోలను అప్డేట్ చేసేలా ప్రత్యేక యాప్ రూపొందించారు. దీనివల్ల ఈ ఒక్క ఏడాదిలోనే రూ.60-70 కోట్ల నిధుల దుర్వినియోగాన్ని ఆపారు. శాఖల డేటా అనుసంధానంతో గ్రామాలకు టెన్స్టార్ రేటింగ్ అమలుచేయడం, ఆర్ఎఫ్ఐడీ కార్డు ద్వారా చెత్త సేకరణ తదితర నిర్ణయాల వల్ల స్కోచ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్-గవర్నెన్స్ అవార్డును లోకేశ్ దక్కించుకున్నారు. అవార్డు రావడం పట్ల పలువురు లోకేష్కు అభినందనలు తెలిపారు.












Click it and Unblock the Notifications