ఏపీలోనే ఎందుకు పెట్టుబడులు పెట్టాలంటే ? అమెరికా ఇన్వెస్టర్లకు చెప్పిన నారా లోకేష్..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఉన్న దేశ, విదేశీ పెట్టుబడిదారులంతా తరలివెళ్లిపోయారు. దీంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వారిని తిరిగి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీంతో పాటు కొత్త పెట్టుబడిదారుల్ని వెతుకుతోంది. ఇందులో భాగంగా అమెరికా పర్యటనకు వెళ్లిన మంత్రి నారా లోకేష్.. శాన్ ఫ్రాన్సిస్కోలో పెట్టుబడిదారులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఉన్న పెట్టుబడుల అనుకూల వాతావారణాన్ని వారికి వివరించారు.
ఏపీలో ఎందుకు పెట్టుబడులు పెట్టాలో అమెరికన్ పారిశ్రామిక వేత్తలకు, ముఖ్యంగా భారత్ నుంచి వెళ్లి అక్కడ వ్యాపారాలు చేస్తున్న వారికి నారా లోకేష్ వివరించారు. ఏపీకి దేశంలో మరే రాష్ట్రానికి లేని విధంగా జల, రోడ్డు, వాయు రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, సుమారు వెయ్యి కిలోమీటర్ల తీర ప్రాంతానికి రోడ్డు కనెక్టివిటీ అనుసంధానమై ఉందని తెలిపారు. భారత్ లో ప్రస్తుతం పెట్టుబడిదారులకు అన్నివిధాలా అనువైన ప్రాంతం ఆంధ్రప్రదేశ్ అన్నారు.

శాన్ ఫ్రాన్సిస్కోలో డ్రాప్ బాక్స్ కో ఫౌండర్ సుజయ్ జస్వా నివాసంలో పలువురు పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. అమరావతి రాజధాని పరిసరాల్లో ప్రభుత్వరంగంలో 3బిలియన్ డాలర్లు, ప్రైవేటు రంగంలో 4.5బిలియన్ డాలర్లతో వివిధ నిర్మాణాలు, అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయని చెప్పారు. వీటికి తోడుగా రాష్ట్రంలోని మచిలీపట్నం, రామాయపట్నం, కాకినాడ, మూలపేట ప్రాంతాల్లో కొత్తగా గ్రీన్ ఫీల్డ్ పోర్టులు త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయని తెలిపారు.

అలాగే వచ్చే ఏడాదిన్నరలో పూర్తికానున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా పెద్దఎత్తున ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోనున్నాయని లోకేష్ వారికి వివరించారు. అమరావతిలో ఎఐ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నామని, రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయ్యే ఎఐ సంస్థలకు అవరమైన మ్యాన్ పవర్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. అన్నివిధాలా అనుకూల వాతావరణం కలిగిన ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా మంత్రి లోకేష్ పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications