'రాజధానిగా గుంటూరే అనుకూలం.. కానీ, సింగపూర్లా'
ఏపీ మంత్రులు పలువురు గుంటూరు రాజధానిగా బాగుంటుందని అంటున్నారు. పురపాలక శాఖ మంత్రి, రాజధాని రూపురేఖల సలహా కమిటీ చైర్మన్ పి నారాయణ కూడా గుంటూరు సౌకర్యంగా ఉంటుందంటున్నారు. కానీ ఇంకా ఏమీ ఖరారు కాలేదని ఆయన చెప్పారు.
రాష్ట్రంలో అన్ని జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉండేలా రాజధాని కేంద్రాన్ని ఎంపిక చేస్తామని, గుంటూరు - విజయవాడ మధ్య ఇందుకు అనువైన పరిస్థితులు ఉండే అవకాశముందని చెప్పారు. సింగపూర్ తరహాలో రాజధాని నిర్మాణం జరుగుతుందన్నారు. ఆయన ఓ ప్రముఖ టీవీ ఛానల్తో రాజధాని అంశం పైన స్పందించారు. ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకొని రాజధాని ఎంపిక, నిర్మాణం జరుగుతుందన్నారు. శివరామకృష్ణమన్ కమిటీని 22న కలుస్తామన్నారు.
గుంటూరు - విజయవాడ మధ్యనే రాజధాని ఉంటుందని అధికార పార్టీ నేతలు చాలా రోజులుగా అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో రాజధాని అక్కడే ఏర్పాటు అయ్యే అవకాశాలున్నాయని అందరు భావిస్తున్నారు. ఈ కారణంగానే రెండో రాజధానిగా అనంతపురం జిల్లాను ఏర్పాటు చేయాలని, రాయలసీమను అభివృద్ధి చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.