తట్టాబుట్టా సర్దుకోవాల్సిందే.. ఓటమి భయంతోనే కుప్పం పర్యటన.. చంద్రబాబుపై పెద్దిరెడ్డి ఫైర్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయం బాబును వెంటాతుందన్నారు. కుప్పం నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. టీడీపీ మాటలను నమ్మే స్థితిలో జనం లేరని మండిపడ్డారు. కుప్పం నుంచి మరోసారి చంద్రబాబు గెలిచే పరిస్థితి లేదని.. గెలవ్వనియమని పెద్దిరెడ్డి శపధం చేశారు. తట్టాబుట్టా సర్దుకోని పోవాల్సిందేనని ఎద్దేవా చేశారు .
చంద్రబాబు పర్యటన వైసీపీ నైతిక విజయం
చంద్రబాబులో నిరాశ , నిస్పృహ నెలకొందని మంత్రి పెద్దిరెడ్డి విమర్శించారు . వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయం, అభద్రతా భావంతో చంద్రబాబు ఉన్నారని దుయ్యబట్టారు. అందుకే 3 రోజుల పాటు కుప్పంలో పర్యటిస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇప్పుడు కుప్పం బాట పట్టడం తమ పార్టీ నైతిక విజయమని పేర్కొన్నారు. గతంలో ఎన్నికలు ఉప్పుడే పర్యటించే వారు.. కానీ ఇప్పుడు గ్రామాల్లో పర్యటిస్తున్నారని విమర్శించారు. కుప్పం నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా.. ఈ నియోజకవర్గంలో పర్యటించని గ్రామాలు ఉన్నాయన్నారు.
కుప్పంలో ఓటమి తప్పదు
కుప్పం ప్రజలు చంద్రబాబును ఇన్నిసార్లు ఆదరించినా వారికి చేసిందేమి లేదన్నారు పెద్ది రెడ్డి. ఆయన చెప్పే మాయ మాటలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదని విమర్శించారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనం గుణపాఠం చెప్పారని ఎద్దేవా చేశారు. బాబు తన కుంచుకోటగా భావించిన కుప్పం మున్సిపాలిటీలో వైసీపీ పాగా వేసిందన్నారు. ప్రజలందరూ చంద్రబాబును చీదరించుకుంటున్నారని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలవరని ప్రజలకు అర్థమైందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కుప్పం నుంచి ఆయన గెలిచే అవకాశం లేకుండా తాము చేస్తామని పెద్దిరెడ్డి హెచ్చరించారు..
బాబు కుట్రలు పనిచేయవ్..మళ్లీ వైసీపీదే అధికారం..
సీఎం జగన్ చేస్తున్న మంచి పనులు చూసి టీడీపీ నేతలు ఒర్వలేకపోతున్నారని పెద్ది రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు . 14 ఏళ్లు సీఎంగా చెప్పుకుంటున్న చంద్రబాబు రాష్ట్రానికి చేసిందేమి లేదని మండిపడ్డారు. కనీసం ఏం చేశానో చెప్పుకోలేని పరిస్థతిలో ఉన్నారని విమర్శించారు. వైఎస్ జగన్ సీఎం అయ్యేంత వరకు రాష్ట్రంలో అర్హులైనవారికి ఇల్లు, పెన్షన్లు ఇవ్వలేదని ఆరోపణలు గుప్పించారు. అన్ని వర్గాల అభివృద్ధికి జగన్ కృషి చేస్తున్నారు. పారదర్శకంగా అందరికి పథకాలు అందేలా చేస్తున్నారని పేర్కొన్నారు. జగన్ చేస్తున మంచి పనులను చూసి ఓర్వలేక టీడీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని పెద్ది రెడ్డి ఆరోపణలు గుప్పించారు. మళ్లీ వచ్చేది కూడా వైసీపీ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు.