అపశృతులతో మొదలైన లోకేష్ పాదయాత్ర.. జగన్తో పోలికా? ఆయన తరం కాదన్న ఏపీ మంత్రి!!
అపశృతులతో మొదలైన లోకేష్ పాదయాత్ర వల్ల ప్రయోజనం లేదని, జగన్ పాపులారిటీని తొలగించడం లోకేష్ వల్ల కాదని ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు నారా లోకేష్ ను టార్గెట్ చేశారు.
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పాదయాత్రను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే తొలిరోజే అనేక అపశృతులతో ఆయన పాదయాత్ర మొదలు కావడం ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది. అధికార వైసిపికి నారా లోకేష్ ను టార్గెట్ చేయడానికి ఆయుధంగా మారింది. నారా లోకేష్ నిర్వహిస్తున్న యువ గళం పాదయాత్ర విషయంలో మంత్రి సీదిరి అప్పలరాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
నారా లోకేష్ పాదయాత్రకు ఒక లక్ష్యం అంటూ లేదు: మంత్రి అప్పలరాజు
నేడు రథసప్తమి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకున్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ లోకేష్ యువగళం పాదయాత్ర చాలా అపశ్రుతులతో మొదలైందని, మన ఆలోచన సక్రమంగా లేనప్పుడు మన ప్రయత్నం వృధా అవుతుందని వ్యాఖ్యానించారు. లోకేష్ పాదయాత్రను చూస్తే తనకు అదే భావన కలిగిందని మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శించారు. నారా లోకేష్ పాదయాత్రకు ఒక లక్ష్యం అంటూ లేదని పేర్కొన్న ఆయన అసలు ఏ లక్ష్యం కోసం పని చేస్తున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల్లో గెలవలేని వ్యక్తి పాదయాత్ర
అప్పట్లో రాష్ట్రంలో అప్రజాస్వామిక విధానాలు ఉండడంతో రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతున్న పాలనపై జగన్ పాదయాత్ర చేశారని తెలిపారు. నేడు అవసరం లేకున్నప్పటికీ ఎన్నికల్లో గెలవలేని వ్యక్తి పాదయాత్ర చేస్తున్నారని, లోకేష్ ఎలాంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి సీదిరి అప్పలరాజు వ్యాఖ్యానించారు.
టిడిపి హాయంలో వైసీపీ ఎమ్మెల్యేలను సంవత్సరం పాటు సస్పెండ్ చేశారని, అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు మైక్ కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని, టిడిపి హయాంలో మొత్తం రాజ్యాంగానికి వ్యతిరేకంగా అప్రజాస్వామిక విధానాలు అమలు చేశారని వండిపడ్డారు.
రేపు పార్టీకి దిక్కెవరు అన్న టెన్షన్ లో చంద్రబాబు
చంద్రబాబు ఓటుకు నోటు కేసులో దొరికిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి రాజధాని కడుతున్నామంటూ, కులం కోసం కుల రాజకీయాలు చేశారని మంత్రి సీదిరి అప్పలరాజు వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు వయసు మీరిందని, ఆయన ఏం మాట్లాడుతున్నాడో కూడా మరిచిపోతున్నారని, రేపు పార్టీకి దిక్కెవరు అన్న టెన్షన్ లో ఉన్నారని పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలవలేని వ్యక్తితో చంద్రబాబు పాదయాత్ర చేయిస్తున్నారని ఎవరెన్ని చేసినా లోకేష్ సక్సెస్ కాలేరు అన్నారు.
జగన్ పై అభిమానం పక్కకు నెట్టటం ఎవరి తరం కాదు
సీఎం వైయస్ జగన్ పైన ప్రజలకు ఉన్న నమ్మకాన్ని పక్కకు నెట్టడం ఎవరితరం కాదనే విషయం తెలుసుకోవాలన్నారు. లోకేష్ కు వైయస్ జగన్ కు ఏమాత్రం పోలిక లేదని, జగన్ తో లోకేష్ ని పోల్చడం వల్ల జగన్ స్థాయి తగ్గుతుందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. శ్రీ సిటీ మేమే కట్టామని చెబుతున్నారని, రేపు అమ్మ ఒడి, ఆరోగ్యశ్రీ కూడా మేమే పెట్టామని చెబుతారని మంత్రి ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో గుర్తుండే ఒక పథకం అయినా ఉందా అంటూ ప్రశ్నించారు.
రాబోయే రోజుల్లో ప్రజలే టిడిపిని, టిడిపి నాయకులను మట్టి కరిపిస్తారు
సిక్కోలు వాసి అయ్యి ఉండి కూడా అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు తనని బాధించాయని పేర్కొన్న మంత్రి పోలీసులు సరిగ్గా గమనిస్తే అచ్చెన్నాయుడు పైన చర్యలు తీసుకోవచ్చని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలే టిడిపిని, టిడిపి నాయకులను మట్టి కరిపిస్తారని మంత్రి సీదిరి అప్పలరాజు అభిప్రాయం వ్యక్తం చేశారు . ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కొన్ని దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయని, వాటన్నిటి నుంచి కాపాడమని నేడు అరసవల్లి సూర్య భగవానుడిని ప్రార్థించానని మంత్రి అప్పలరాజు చెప్పుకొచ్చారు.