రాజకీయం వద్దు, టి సిఎం పిలిస్తే వెళ్తాం: టాక్స్పై ఏపి మంత్రి సిద్దా
హైదరాబాద్: రాష్ట్రాలు రెండైనా తెలుగు ప్రజలందరూ ఒక్కటేనని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు అన్నారు. ప్రజలపై భారం పడకూడదనే రవాణా పన్ను వసూలు జీవోను జారీ చేయడం లేదని ఆయన తెలిపారు. ఆయన శనివారం మాట్లాడుతూ.. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నందున ప్రజలకు రాకపోకలకు హక్కులుంటాయని అన్నారు.
రవాణా పన్నులపై రాజకీయాల చేయడం మంచిది కాదని అన్నారు. పన్ను విధింపుపై తెలంగాణ సర్కారు పునరాలోచించుకోవాలని కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి, రవాణా శాఖ మంత్రి పన్ను విషయమై చర్చలకు పిలిస్తే వెళ్తామని ఆయన చెప్పారు. ప్రజలపై పన్నుల భారం పడకుండా సహకరిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.
ప్రజల ఇబ్బందులను ఆలోచించి పన్ను వసూలును నిలిపేయాలని కోరుతున్నట్లు సిద్ధా రాఘవరావు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చర్చలకు పిలిస్తే వెళ్లి మాట్లాడతామని, లేదంటే 4,5 రోజుల తర్వాత తమ నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు.
తెలంగాణ సర్కారు పన్ను విధింపును కొనసాగించినట్లయితే కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని, కోర్టును ఆశ్రయిస్తామని మంత్రి సిద్ధా రాఘవరావు తెలిపారు. ఏప్రిల్ 2నే పన్నుల వసూలుపై తెలంగాణ సిఎంకు లేఖ రాశామని చెప్పారు.
ఏప్రిల్ 9,10 తేదీల్లో గోవాలో రాష్ట్రాల రవాణా శాఖ మంత్రుల సమావేశం జరిగిందని, ఏపితోపాటు తెలంగాణ మంత్రులు, అధికారులు హాజరయ్యారని తెలిపారు. కేంద్రం ప్రవేశపెట్టిన సేఫ్టీ బిల్లుకు ఏపి ప్రభుత్వం తరపున అంగీకారం తెలిపామని చెప్పారు.