ఉద్యోగుల కోసం మంత్రులు బొత్స, పేర్ని ఎదురుచూపులు- హైకోర్టు వ్యాఖ్యలతో నేతల్లో టెన్షన్
ఏపీలో పీఆర్సీ వివాదం నేపథ్యంలో ఉద్యోగసంఘాలు సమ్మెబాట పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వారిని ఇవాళ చర్చలకు ఆహ్వానించింది. ఉద్యోగసంఘాలతో చర్చలు జరిపే బాధ్యతను మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్నినానికి అప్పగించింది. దీంతో ఉద్యోగసంఘాలతో చర్చల కోసం ఇవాళ మంత్రులు సచివాలయానికి వచ్చారు. ఉదయం 11 గంటలకు సచివాలయానికి వచ్చిన మంత్రులు ఉద్యోగసంఘాల నేతల కోసం ఎదురుచూస్తున్నారు.
Recommended Video
పీఆర్సీ వివాదంపై ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించినా ఉద్యోగసంఘాలు మాత్రం పట్టు వీడటం లేదు. ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసిన పీఆర్సీ జీవోలు వెనక్కితీసుకుంటేనే చర్చలకు హాజరవుతామని ఉద్యోగసంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఉద్యోగసంఘాల నేతలు సమ్మెకు సంబంధించి చర్చలు జరుపుతున్నారు. ఉద్యోుగ సంఘాలు ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ప్రభుత్వానికి సచివాలయంలో సమ్మె నోటీసు ఇవ్వాల్సి ఉంది. కానీ ఈ లోపే హైకోర్టులో వారు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరగడం, జీతాలపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలతో ఈ వ్యవహారం మరో టర్న్ తీసుకోబోతోంది.
గెజిటెడ్ ఉద్యోగులసంఘం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు... సమ్మె నోటీసు ఇస్తున్న 12 మంది ఉద్యోగసంఘాల నేతల్ని హైకోర్టుకు పిలిపించింది. దీంతో వారిని హైకోర్టుకు వెళ్లాలని జీఏడీ కార్యదర్శి శశిభూషణ్ ఫోన్లు చేసి సమాచారం ఇస్తున్నారు. సమ్మెకు సంబంధించి హైకోర్టులో కీలక విచారణ నేపథ్యంలో ఉద్యోగులు సమ్మె నోటీసువిషయంలో ఏం చేయబోతున్నారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. హైకోర్టు విచారణతో సంబంధం లేకుండా ఉద్యోగులు సమ్మె నోటీసు ఇస్తారా లేక హైకోర్టు వ్యాఖ్యలతో వెనక్కి తగ్గుతారా అన్నది ఉత్కంఠ రేపుతోంది.