చంద్రబాబు పొత్తుల ఆరాటం - పవన్ కల్యాణ్ ప్యాకేజీ పోరాటం : చంద్రబాబు పై మంత్రుల ఫైర్..!!
టీడీపీ అధినేత పరోక్షంగా చేసిన పొత్తుల వ్యాఖ్యల పైన ఏపీ మంత్రులు రియాక్ట్ అయ్యారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ ఒక్కటిగా ప్రజాపోరాటాలు చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అదే సమయంలో టీడీపీ ముందుండి నడిపిస్తుందని..అవసరమైతే త్యాగాలకు సిద్దమని ప్రకటించారు. చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు ఒక్క సారిగా ఏపీ రాజకీయాలను హీటెక్కించాయి. చంద్రబాబు వ్యాఖ్యల పైన మంత్రి జోగి రమేష్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. పొత్తుల కోసం చంద్రబాబు ఆరాట పడుతుంటే.. ప్యాకేజీ కోసం పవన్ కళ్యాణ్ పోరాటం చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.
ఎంత మంది కలిసినా 2024లో వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేసారు. సింహం సింగిల్గానే వస్తుందంటూ చెప్పుకొచ్చారు. 2014లో ముగ్గురు కలిసి పోటీ చేశారు, 2019లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలేలా ప్రయత్నించారని విమర్శించారు. పెద్ద ఎత్తున అభివృద్ధి- సంక్షేమం చేస్తున్న జగన్ ప్రభుత్వం పై ప్రజా వ్యతిరేకత ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. ఇక, చంద్రబాబుకు సొంతంగా పోటీ చేసే ధైర్యం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి అన్నారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా పొత్తులతోనే చంద్రబాబు పోటీ చేస్తారని ఎద్దేవా చేశారు.
చంద్రబాబుకు నైతికత, సిద్ధాంతం లేదు. ఎవరితోనైనా పొత్తుకు ప్రయత్నాలు చేస్తారని దుయ్యబట్టారు. వీళ్లంతా కట్టకట్టుకుని వచ్చినా మమ్మల్ని తమ పార్టీని చేయలేరని ధీమా వ్యక్తం చేసారు. దత్తపుత్రుడు పవన్ కల్యాణ్, మిగిలిన పార్టీలన్నీ ఒకే మాట మాట్లాడుతున్నాయని ఆరోపించారు. వీరంతా కలిసే పని చేస్తున్నారన్నారంటూ మంత్రి కాకాని విమర్శించారు. మామ ఎన్టీఆర్ దగ్గర నుంచి పార్టీ లాక్కున్న వ్యక్తికి నైతికత ఏముంటుందని మంత్రి కాకాణి ప్రశ్నించారు.
వైసీపీ గెలుస్తుందనే భయం - బాధతోనే చంద్రబాబు రెండేళ్ల ముందే పొత్తులు గురించి మాట్లాడుతున్నారన్నారు. దత్తపుత్రుడిని పక్కన పెట్టుకుని నడిచారని..మళ్లీ అదే బీజేపీని తిట్టిపోసి..మళ్లీ ఇప్పుడు పొత్తు కోసం వెంపర్లాడుతున్నారంటూ దుయ్యబట్టారు. అయితే, చంద్రబాబు చేసిన వ్యాఖ్యల తరువాత జనసే కీలక నేత సైతం జగన్ ప్రభుత్వం పైన పోరాటానికి అందరూ కలిసి కట్టుగా పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. ఇక, ఈ నెల 8వ తేదీన పవన్ కళ్యాణ్ కర్నూలు పర్యటనలో భాగంగా..ఈ మొత్తం వ్యవహారం పైన క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.