బాంబులతో పేలుస్తామంటారా?: కేసీఆర్పై గవర్నర్కు ఏపీ ఫిర్యాదు
హైదరాబాద్: గవర్నర్ నరసింహన్ను ఆంధ్రప్రదేశ్ మంత్రులు బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి, పీ నారాయణ, గంటా శ్రీనివాస రావు, కామినేని శ్రీనివాస రావు, పీతల సుజాత, రావెల కిషోర్, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తదితరులు కలిశారు. ఉమ్మడి రాజధాని హైదరాబాదులో సమాన అధికారాలు ఉండేలా చూడాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని, ఈ నగరంపై రెండు ప్రభుత్వాలకు సమాన హక్కులున్నాయని వారు గవర్నర్ నరసింహన్కు చెప్పారు. హైదరాబాద్లో ఉన్నవి సమాంతర ప్రభుత్వాలని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సబార్డినేట్ కాదని చెప్పారు.
రెండు ప్రభుత్వాలు ఉమ్మడి రాజధాని నుంచి వేటి పాలన అవి చేసుకునేలా రాష్ట్ర పునర్విభజన చట్టంలో సెక్షన్ 8ని పేర్కొన్నారని, దానిలోని అంశాలన్నింటినీ అమలు చేయాలని కోరారు. ఉమ్మడి రాజధానిలో పరిపాలన, ప్రజల భద్రత, ఆస్తుల పరిరక్షణ, స్వేచ్ఛ ఇవన్నీ పరిరక్షించేందుకు సెక్షన్ 8 నిర్దేశిస్తుందని తెలిపారు.
ఈ అంశాల్లో తెలంగాణ ప్రభుత్వ సలహాలు తీసుకున్నా నిర్ణయం మాత్రం గవర్నర్దేనని పేర్కొన్నారు. గవర్నర్కు ఇలాంటి వ్యవహారాల్లో సహకరించేందుకు ఇద్దరు సలహాదారులను కూడా నియమించారని, వారి సేవలను ఉపయోగించుకోవచ్చన్నారు.
ఏపీ హక్కులను కేసీఆర్ హరిస్తున్నారని, నీచంగా మాట్లాడుతున్నారని, సుంకేశుల డ్యాంను బాంబులేసి కూలగొడతానని ఓ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అసహ్యంగా మాట్లాడారని, ఈ విషయంలో ఆయనను నియంత్రించాలని గవర్నర్ను కోరారు. ఏపీ ప్రజల పైన ద్వేషంతో కేసీఆర్ మాట్లాడుతున్నట్లుగా ఉందన్నారు.
అయితే, కేసీఆర్ మాట్లాడినట్లు చెబుతున్నవి మీడియాలో వచ్చినవి, మీడియాలో వచ్చిన అన్నింటినీ నమ్మలేమన్న రీతిలో గవర్నర్ వ్యాఖ్యానించారని సమాచారం. ట్యాపింగ్పై గవర్నర్ మాట్లాడుతూ.. ట్యాపింగ్ జరిగిందా లేదా అన్నది ఊహాజనితమని, దానిపై తానేమీ మాట్లాడనని చెప్పారని తెలుస్తోంది.