టీడీపీపై అనర్హత వేటుకు బొత్స డిమాండ్-ప్రాణాలు తీస్తుంటే చూస్తూ ఊరుకోవాలా- అందుకే జీవో 1
ఏపీలో చంద్రబాబు సభల్లో తొక్కిసలాట ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1పై దుమారం కొనసాగుతోంది. ముఖ్యంగా చంద్రబాబు కుప్పం టూర్ లో పోలీసులు ఆయన్ను అడ్డుకున్న నేపథ్యంలో టీడీపీతో పాటు ఇతర విపక్షాలు, మీడియా జీవో నంబర్ 1పై దుమ్మెత్తిపోస్తున్నాయి. దీంతో మంత్రి బొత్స సత్యనారాయణ ఇవాళ స్పందించారు.
గత మూడు, నాలుగురోజులుగా చంద్రబాబు, ఆయన తోక పార్టీలు, పచ్చమీడియా జీవోనెంబర్1 పై అదేపనిగా గగ్గోలు పెడుతున్నాయని బొత్స ఆరోపించారు. ప్రతిపక్షాల గొంతునొక్కేందుకు ప్రభుత్వం ఈ జీవోను తెచ్చిందంటూ విమర్శలు చేస్తున్నారన్నారు. ఇలా మాట్లాడుతున్నవారంతా ఆ జీవోను పూర్తిగా చదివారా..? చదివిన వాళ్లు ఏం అర్ధం చేసుకున్నారని ప్రశ్నించారు. ఆ జీవోలో ఎక్కడైనా బహిరంగ సభలు, రోడ్షోలు నిర్వహించడానికి వీల్లేదని ఉందా..? లేదుకదా.. మరి, ఎందుకు పనిగట్టుకుని రాద్ధాంతం చేస్తున్నారన్నారు.
చంద్రబాబు ఈ రాష్ట్రంలో పర్యటిస్తుంటే.. ఆయన వెంట ప్రజలు లక్షలాదిగా వెంబడిస్తుంటే ప్రభుత్వం ఏదో అడ్డుపడుతుందని నానా యాగీ చేయడానికి సిగ్గుగా లేదా..? అని బొత్స ప్రశ్నించారు. చంద్రబాబు, మిగతా ప్రతిపక్షాలు వారి రాజకీయ లబ్ధికోసం ఏవేవో అబద్ధాలు, అవాస్తవాలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రభుత్వం ఒక జీవోను విడుదల చేస్తే.. దాన్ని పూర్తిగా కూలంకషంగా చదివి ప్రజలకు అర్ధమయ్యేరీతిగా సమాచారమివ్వడమనేది మీడియా బాధ్యత కాదా అని బొత్స అడిగారు. చంద్రబాబుకు వత్తాసుపలికే మీడియా తన బాధ్యతను మరిచి ప్రజల్లోకి తప్పుడు సమాచారాన్ని పంపుతుందని ఆక్రోశం వెళ్లగక్కారు.
జాతీయ, రాష్ట్ర రహదారుల్లోనూ, రోడ్డుమార్జిన్లలో బహిరంగ సభలు నిర్వహించరాదని.. అత్యవసర పరిస్థితుల్లో, ఆ కార్యక్రమాలు జరుపుకోవాలనుకుంటే మాత్రం ప్రభుత్వ అనుమతులతో నిర్ధేశించిన ప్రాంతాల్లో జరుపుకోవాల్సి ఉందనేది జీవో సారాంశమని బొత్స తెలిపారు. ఇంత స్పష్టంగా ఉన్న సమాచారాన్ని పచ్చమీడియా కావాలని వక్రీకరించడం ఏవిధంగా చూడాలి..? ఇలాంటి రాతల్ని, ఎత్తుగడల్ని ప్రజలు ఆమాత్రం అర్ధం చేసుకోలేరనేది పచ్చమీడియా భ్రమ మాత్రమేనని బొత్స అన్నారు.
పచ్చమీడియా టీవీలు, పత్రికలు చంద్రబాబు జవసత్వాలను జాకీలెత్తి పైకిలేపుదామని ఎంత ప్రయత్నించినా.. వాళ్ల ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరే అని బొత్స విమర్శించారు. అసలు ప్రభుత్వం ఈ జీవో నెంబర్.1 తేవడానికి కారణం చంద్రబాబేనన్నారు.ఆయన కందుకూరు, గుంటూరులో చేసిన దుర్మార్గమైన సభల వల్లే కదా..? ఆయనను ఆకాశానికెత్తే మీడియాకు ఈ విషయం తెలియదా అని ప్రశ్నించారు. టీడీపీని, పార్టీ కార్యక్రమాలను తాను నడపలేను అనుకుంటే.. చంద్రబాబును హైదరాబాద్కు వెళ్లి ఇంట్లో కూర్చోమనండన్నారు. అంతేగానీ, ప్రభుత్వం మీద ఏడ్చి.. ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తూ.. ప్రభుత్వ జీవోలను సాకుగా చూపించి రాద్ధాంతం చేయడమెందుకు..? అని అడిగారు. ప్రభుత్వ చట్టాలు, జీవోలనేవి అధికారపక్షానికి ఒకటి, ప్రతిపక్షాలకు వేరొకటి అంటూ ఉండవు. ప్రజల తరఫున రక్షణ, వారికి అసౌకర్యం కలిగించకుండా చూసుకోవడం ప్రభుత్వం బాధ్యత. చట్టాలు, జీవోలను అందరూ గౌరవించాల్సిందేనన్నారు.
నేనేదో సభ పెట్టానని.. ఈ జీవో మంత్రికి వర్తించదా.. అని చంద్రబాబు బరితెగించి మాట్లాడుతున్నారని, మహాత్మ జ్యోతిబా ఫూలే విగ్రహావిష్కరణకు హాజరై వెళ్లిపోయానని బొత్స క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత విగ్రహావిష్కరణ కమిటీ ర్యాలీ చేసుకున్నారు. వాళ్లుకూడా ఎక్కడా రూల్స్ అతిక్రమించలేదన్నారు. చంద్రబాబు ప్రతీది సానుభూతి పొందాలని, ప్రతి అంశాన్నీ తన రాజకీయలబ్ధికి వాడుకునేంత మేధావితనాన్ని ఈ రాష్ట్రంలో ఏ నాయకుడు చేయలేడన్నారు. ఈరోజు పర్యటనల పేరిట బాబు పెద్దపెద్ద మాటలతో ఆయనో దైవాంశ సంభూతుడిలా మాట్లాడితే ప్రజలు నమ్ముతారేమోననే భ్రమలో బతుకుతున్నాడన్నారు. ఆయన గురించి, ఆయన రాజకీయ ఎత్తుగడల గురించి ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ ఏనాడో తెలిసిపోయిందన్నారు. అందుకే 2019లో ఓడించి ఇంట్లో కూర్చొబెట్టారన్నారు. చంద్రబాబు రాజకీయ లబ్ధికోసం అమాయక ప్రజలు చనిపోతుంటే.. ప్రభుత్వం చూస్తూ ఊరుకోమంటారా..? అని ప్రశ్నించారు.