ఏపీ మున్సిపల్ ఎన్నికలలో మొదలైన ప్రలోభాల పర్వం... మద్యం , డబ్బు పంపిణీపై ఎస్ఈసి ప్రత్యేక నిఘా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతుంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్న వైసిపి ,టిడిపి, బిజెపి, జనసేన నేతలు ఒకరి మీద ఒకరు విమర్శలు గుప్పిస్తూనే ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. గడపగడపకు తిరుగుతూ ఓట్ల కోసం అభ్యర్థిస్తున్నారు. అంతేకాదు ప్రలోభాలకు రంగం సిద్ధం చేస్తున్నారు .

హోరాహోరీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన రాజకీయ పార్టీల నేతలు
తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచార బరిలోకి దిగిన చంద్రబాబు, నారా లోకేష్ లు ఎన్నికలు జరుగుతున్న మున్సిపల్ కార్పొరేషన్ లలో పర్యటిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇక వైసీపీ తరఫున మంత్రులు రంగంలోకి దిగి ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి గడపగడపకు తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. మరోపక్క బిజెపి, జనసేన నేతలు సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. హోరాహోరీగా, ఒకరిని మించి ఒకరు పోటీ పడి చేస్తున్న ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంత్రం ఐదు గంటలతో ముగియనుంది.

ప్రచారానికి తెర .. ప్రలోభాలతో ఎర
ఈరోజు ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో అన్ని పార్టీల నేతలు భారీ సంఖ్యలో రంగంలోకి దిగి ప్రచారాన్ని సాగిస్తున్నాయి. ఈరోజు ఎన్నికల ప్రచార పర్వానికి సాయంత్రంతో తెరపడనుండగా ప్రలోభాల పర్వానికి రంగం సిద్ధమైంది.
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా నామినేషన్ల ఉపసంహరణకు ప్రత్యర్థి అభ్యర్థులను ప్రలోభాలకు గురి చేసిన నేతలు, ఇప్పుడు ఓట్ల కోసం ప్రజలను ప్రలోభాలకు గురి చేసే పనిలో నిమగ్నమయ్యారు. పెద్ద ఎత్తున డబ్బు, మద్యం పంపిణీకి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది.

ఎన్నికల ప్రలోభాలకు గుట్టు చప్పుడు కాకుండా ఏర్పాట్లు
ఎన్నికలలో మద్యం, డబ్బు పంపిణీని అడ్డుకోవడం కోసం రాష్ట్ర ఎన్నికల కమీషన్ ప్రత్యేకంగా దృష్టి సారించినప్పటికీ గుట్టు చప్పుడు కాకుండా ఎవరి సన్నాహాల్లో వాళ్ళున్నారు . ఎలాంటి ప్రలోభాలు లేకుండా ఎన్నికలు జరగవు అనేది జగమెరిగిన సత్యం. రాష్ట్రంలోని 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు , నగర పంచాయతీల్లో 2,215 డివిజన్లు, వార్డు స్థానాలకు 7,552 మంది అభ్యర్థులు వివిధ పార్టీల తరఫున పోటీ చేస్తున్నారు.

ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం .. ప్రలోభాలపై ఎస్ఈసి నిఘా
ఈ నెల 3న నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన తర్వాత బరిలో ఉన్న అభ్యర్థులు గత నాలుగు రోజులుగా విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. పదవ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 14వ తేదీన ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు. ఇప్పటికే పోలింగ్ కు సంబంధించిన పూర్తి ఏర్పాట్లను చేసింది రాష్ట్ర ఎన్నికల కమిషన్. ఇక డబ్బు, మద్యం పంపిణీ ఫిర్యాదులు రావడంతో గట్టి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తుంది. మొత్తానికి ఈరోజుతో ఎన్నికల ప్రచారంలో మైకులు మూగబోనున్నాయి. సైలెంట్ గా ప్రలోభాల పర్వాన్ని కొనసాగించడానికి రెడీ అవుతున్నాయి రాజకీయ పార్టీలు












Click it and Unblock the Notifications